సంస్కరణలతో డీసీసీబీ అద్భుత ఫలితాలు
ఏడాదిలో రూ.7కోట్ల లాభాలు
అన్ని రకాల రుణాలతో ప్రజలకు చేరువ
కమర్షియల్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీరేటు
రూ.870 కోట్ల నుంచి రూ.1144కోట్లకు టర్నోవర్
సంస్కరణలతో అద్భుత ఫలితాలు సాధించిన డీసీసీబీ
ఏడాదిలో రూ.7కోట్ల లాభాల ఆర్జన
ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ) ఆర్థికంగా బలోపేతమవుతున్నది. గత పాలకవర్గాలకు భిన్నంగా ఇప్పుడున్న పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలు బ్యాంకును లాభాల బాట పట్టించాయి. లోన్లు, రికవరీ, డిపాజిట్ల సేకరణ విషయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అన్ని వర్గాల ప్రజల కు రుణాలు ఇవ్వడంతో అనతి కాలంలోనే ఆర్థికంగా పరిపుష్టి సాధించింది. కరీంనగర్ బ్యాంకును ఆదర్శం గా తీసుకొని చిన్నాచితకా వ్యాపారం చేసుకునే పేద, మధ్య తరగతి ప్రజలు, మహిళా సంఘాలు, గ్రామీణ ప్రాంతాల్లో హౌసింగ్ లోన్లు, గోల్డ్ లోన్లు, మార్ట్గేజ్, ఎల్టీలోన్లు, పాడి పశువులు పెంపకం, కోళ్ల పరిశ్రమలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇలా అనేక రకాల రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడంతో మంచి ఫలితాలు సాధించింది. రుణ వడ్డీ శాతం కమర్షియల్ బ్యాంకుల కంటే తక్కువగా ఉండడంతో రుణాలు తీసుకోవడానికి ప్రజలు ముందుకొస్తున్నారు. పాలకవర్గం తీసుకున్న సంస్కరణల ఫలితంగా 2020-21 వార్షిక సంవత్సరంలో మంచి లాభాలు వచ్చాయి.
ఏడాది కాలంలోనే రూ.6,99,23,000 నికర లాభం వచ్చినట్లు ఇటీవలే పాలకవర్గం అధికారికంగా ప్రకటించింది. ఇంతకు ముందు రుణాల రికవరీ శాతం 7.5 ఉండేది. ప్రస్తుత పాలకవర్గం తీసుకున్న కఠిన నిర్ణయాలు, బ్యాంకు సం బంధించిన 19 బ్రాంచ్లలో పెండింగ్, నెలవారీగా చెల్లించాల్సిన రికవరీపై ప్రత్యేక విభాగం ఏర్పాటు, నెలవారీగా సమీక్షలు చేయడంతో ఈ వార్షిక సంత్సరం లో రికవరీ 3.4 శాతానికి తగ్గింది. అంటే బ్యాంకు నుం చి ఇచ్చిన రుణాల రికవరీ గణనీయంగా పెరిగింది. దీని ఆధారంగా నాబార్డు కానీ, ‘టెస్కాబ్’ కానీ బ్యాంకుకు రుణ సహాయం చేయడానికి ముందుకొస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డీసీసీబీకి అనుబంధంగా 96 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. యాసంగి, వానకాలంలో రెండు సీజన్లలో ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల అమ్మకాల ద్వారా సంఘాలకు రూ.లక్షల కమీషన్ వస్తుండడంతో ఆర్థికంగా బలపడుతున్నాయి. ప్రస్తుత పాలక వర్గం బాధ్యతలు చేపట్టక ముందు రూ.870 కోట్ల టర్నోవర్ ఉండగా, ఇప్పుడది రూ.1144కోట్లకు చేరింది. పీఏసీఎస్లలో 5లక్షలమంది సభ్యులు ఉండగా, 3 లక్షల మందికి పైగా డీసీసీబీ 19 బ్రాంచ్లలో ఖాతాలు కలిగి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన వద్దు
కోదాడలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి