యూనివర్సిటీ అభివృద్ధికి బాటలు వేద్దాం
బోధన, పరిశోధన రంగాలపై ప్రత్యేక దృష్టి
వర్సిటీ భూముల రక్షణకు ప్రహరీ నిర్మాణం
కేయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్
భీమారం, జూన్ 7 : కాకతీయ యూనివర్సిటీ ముందున్న సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడడంతోపాటు వివిధ సంస్థలను సంప్రదిస్తూ నియామకాలు చేపడుదామని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. వీసీగా రమేశ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి సోమవారం కేయూ సెనెట్ హాల్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకట్రామ రెడ్డి అధ్యక్షతను కేయూ పరిధిలోని వివిధ కాలేజీ ప్రిన్సిపాల్స్,వివిధ విభాగాధిపతులు, పరీక్షల నియంత్రణాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీసీ రమేశ్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ భూముల రక్షణకు ప్రహరీ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. సమష్టిగా పని చేసి వర్సిటీని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రత్యేకంగా బోధన, పరిశోధన, విద్యార్థుల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. 2022 న్యాక్కు ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
విశ్వవిద్యాలయం పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువుతున్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలన్నారు. అనంతరం యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఆన్లైన్ తరగతులు, సిలబస్ పురోగతి, ప్రయోగ తరగతులు, పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలు, బోధన, బోధనేతర ఉద్యోగులు, తదితర అంశాలపై సమీక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాధిపతులు, ప్రొఫెసర్ల కే డేవిడ్, బన్న అయిలయ్య, ఎం రాజేశ్వర్, టీ మనోహర్,వీ రామచంద్రం, పీ వరలక్ష్మి, ఆర్ మల్లికార్జున్ రెడ్డి, ఎస్ పరిసింహాచారి, ఎం సౌజన్య యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితులపై వివరించారు. ఈ కార్యక్రమంలో వై వెంకయ్య, ఎం సురేఖ, పీ సదానందం, అశోక్బాబు, శ్రీధర్, ప్రణయ్కుమార్, పృథ్వీరాజ్ పాల్గొన్నారు.