నర్సంపేట, మే 7: జ్వర పీడితుల సమాచారం వెంటనే ఇవ్వాలని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ అన్నారు. పట్టణంలో జరుగుతున్న ఇంటింటా సర్వేను శుక్రవారం ఆయన పరిశీలించారు. జ్వరపీడితులకు వైద్య చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం అవుతున్నదని తెలిపారు. జ్వరం, నొప్పుల వంటి లక్షణాలు ఉన్న వారు ఇంట్లో ఎంతమంది ఉన్నారో సర్వే బృందం వివరాలు సేకరిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆశ వర్కర్, ఏఎన్ఎం పాల్గొన్నారు.
పరకాల: మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో 28 మంది సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు. సర్వేను మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్స్వామి పర్యవేక్షించారు. పట్టణంలో శనివారంతో సర్వే పూర్తవుతుందని ఆయన తెలిపారు. మండలంలోని గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు ఎంపీడీవో బాలకృష్ణ తెలిపారు. మండలంలో 4,543 కుటుంబాల్లో 151 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.
బాధితులకు కరోనా కిట్ల అందజేత
వర్ధన్నపేట: గ్రామాల్లో కరోనా బాధితులకు వైద్య సిబ్బంది కిట్లను అందజేశారు. వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఇంటింటా సర్వే చేపట్టడంతో పాటు కరోనా బాధితుల వివరాలను సమగ్రంగా తీసుకుంటున్నారు. లక్షణాలు ఉన్నట్లు ఏమాత్రం గుర్తించినా కిట్ను అందజేస్తున్నారు.
చెన్నారావుపేట: ఎంపీడీవో లలిత ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే చేశారు. మండలంలోని 30 జీపీల్లో 9,741 ఇండ్లు ఉండగా, ఇప్పటి వరకు 8,445 గృహాలను సర్వే చేశామని, 430 మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు ఎంపీడీవో తెలిపారు.
దుగ్గొండి/ఖానాపురం: కరోనా వైరస్ కట్టడికే ప్రభుత్వం ఇంటింటా జ్వరపీడితుల సర్వే చేపట్టిందని రేకంపల్లి సర్పంచ్ ఇమ్మడి యుగేంధర్ అన్నారు. దుగ్గొండి పీహెచ్సీ వైద్య సిబ్బంది రేఖంపల్లి, శివాజీనగర్లో ఇంటింటా సర్వే చేశారు. వైద్య సిబ్బందికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఖానాపురం మండలవ్యాప్తంగా శుక్రవారం రెండో రోజు ఇంటింటా సర్వే కొనసాగింది. లక్షణాలు ఉన్న వారిని సర్వే బృందాలు గుర్తించి మందుల కిట్ అందజేస్తున్నారు.
నర్సంపేట రూరల్: మండలంలోని రామవరం, నర్సింగాపురం, మర్రినర్సయ్యపల్లి, భోజ్యానాయక్తండా, లక్నేపల్లి, మహేశ్వరం, రాజపల్లి, పాతముగ్ధుంపురం, రాజేశ్వర్రావుపల్లిలో సర్పంచ్లు కొడారి రవన్న, భూక్యా లలిత, రాంబాబు, కవిత, భాగ్యమ్మ, సుంకరి లావణ్య, బొజ్జ యువరాజ్ ఆధ్వర్యంలో సర్వే చేశారు. కార్యదర్శులు, వైద్య సిబ్బంది, వీఆర్వోలు, ఆశ వర్కర్లు జ్వర పీడితుల వివరాలు సేకరించారు.
సర్వేకు ప్రజలు సహకరించాలి
దామెర: సర్వేకు ప్రజలు సహకరించాలని దామెర పీహెచ్సీ వైద్యురాలు శిరీష కోరారు. శుక్రవారం పులుకుర్తి, దామెర, ఊరుగొండ, కోగిల్వాయిలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించారు.
10,803 ఇండ్లలో సర్వే పూర్తి
శాయంపేట: మండలంలోని 24 పంచాయతీల్లో 10,803 గృహాల్లో సర్వే పూర్తయినట్లు ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. తొలిరోజు అంగన్వాడీ, ఆశ వర్కర్లు 7,781 ఇండ్లలో సర్వే పూర్తి చేశారని, రెండో రోజు శాయంపేట, పత్తిపాక, గట్లకానిపర్తి, గోవిందాపూర్లో 3,022 నివాస గృహాల్లో సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. మొత్తంగా 395 మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కొప్పులలో 55, గట్లకానిపర్తిలో 47, పత్తిపాకలో 47 మందికి లక్షణాలున్నట్లు గుర్తించారు. సూర్యనాయక్తండా, హుస్సేన్పల్లి ఒక్కటి కూడా నమోదు కాలేదు. గోవిందాపూర్లో రెండు, కొత్తగట్టుసింగారంలో ఐదు, సాధన్పల్లిలో ఒకరికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
ఆత్మకూరు: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టిందని తహసీల్దార్ సురేశ్కుమార్ అన్నారు. సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేయాలని సూచించారు.
సంగెంలో 12,030 ఇండ్ల సర్వే..
సంగెం: కుంటపల్లిలో సర్వేను తహసీల్దార్ బీ విశ్వనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో రెండోరోజు 6,142 ఇండ్ల సర్వేను పూరి చేసినట్లు తెలిపారు. మండలంలోని 14,160 ఇండ్లకు 12,030 ఇండ్లలో సర్వే పూర్తి చేశామన్నారు. 363 మంది జ్వరంతో ఉన్నట్లు గుర్తించామని, అందులో 134 మందికి మెడికల్ కిట్లను అందజేసినట్లు వెల్లడించారు.
325 కుటుంబాలకు లక్షణాలు..
నడికూడ: మండలంలో రామకృష్ణాపూర్ మినహా ఇంటింటా సర్వే పూర్తి చేశామని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. 7,409 ఇండ్లలో 325 కుటుంబాలకు కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. చర్లపల్లి, వరికోల్లో అధికంగా కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించామని తెలిపారు. 16 మందికి మెడికల్ కిట్లు అందించామన్నారు.
గీసుగొండ: మండలంలో ఇంటింటా సర్వే కొనసాగుతున్నది. ఈ సందర్భంగా సీహెచ్వో మధుసూదన్ మాట్లాడుతూ జ్వరం, దగ్గు, జలుబు ఉంటే సర్వే సిబ్బంది వద్ద పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు.