అనుమతి పొందిన విత్తనాలనే రైతులకు విక్రయించాలి
విత్తన డీలర్ల సమావేశంలో పోలీసులు, వ్యవసాయాధికారులు
ఆత్మకూరు, జూన్ 4: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలని సీఐ రంజిత్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన పోలీస్స్టేషన్లో మండలంలోని ఫర్టిలైజర్ షాపుల డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ కల్తీ, నాణ్యత లేని, అనుమతి పొందని విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏవో యాదగిరి మాట్లాడుతూ ఫర్టిలైజర్ల డీలర్లు తప్పకుండా షాపుల ఎదుట సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు విధిగా రసీదులు అందించాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో శ్రీకాంత్, మానస, ఫర్టిలైజర్ల డీలర్లు పాల్గొన్నారు.
కల్తీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్టు
శాయంపేట: కల్తీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్టు నమోదు చేస్తామని సీఐ తోగిటి రమేశ్కుమార్ హెచ్చరించారు. మండల పరిధిలోని ఫర్టిలైజర్స్, సీడ్స్ షాపుల యజమానులు, వ్యవసాయ శాఖ అధికారులకు పోలీస్స్టేషన్ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. నకిలీ, కల్తీ విత్తనాలపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నదని సీఐ అన్నారు. బీటీ-3 విత్తనాలు అమ్మొద్దన్నారు. రైతులు ఏది కొన్నా రసీదు తీసుకోవాలన్నారు. సదస్సులో ఎస్సై అకినపెల్లి ప్రవీణ్కుమార్, ఏవో గంగాజమున, ఏఈవోలు పాల్గొన్నారు.
బిల్లులు, స్టాక్ రిజిస్టర్ల పరిశీలన
ఖానాపురం: నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీయాక్టు నమోదు చేస్తామని ఎస్సై సాయిబాబు, ఏవో శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం మండలకేంద్రంతోపాటు బుధరావుపేట, మంగళవారిపేటలోని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వారు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వ్యవసాయాధికారుల తనిఖీ
దుగ్గొండి: మండలంలోని విత్తన విక్రయకేంద్రాల్లో వ్యవసాయాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏవో చిలువేరు దయాకర్ ఆధ్వర్యంలో ఏఈవోలు బృందాలుగా ఏర్పడి విక్రయ కేంద్రాల్లోని స్టాక్ పుస్తకాలు, బిల్ బుక్కులు, ధరల పట్టికలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే అమ్మకాలు జరుపాలని, లైసెన్స్ లేకుండా షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో ఏఈవోలు హన్మంతు, మోడెం విశ్వశాంతి, రాజేశ్, మధు, రైతులు పాల్గొన్నారు.