మంగపేట, ఏప్రిల్ 1 : మండలంలోని వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధి లక్ష్మీనర్సాపురంలో నాగులమ్మ జాతరలో ప్రధాన ఘట్టమైన నాగులమ్మ ఆగమనం గురువారం సాయంత్రం గిరిజన సంప్రదాయం ప్రకారం జరిగింది. ఉపవాస దీక్షతో పూజారులు, వడ్డెలు గండొర్రె గుట్ట నుంచి అమ్మవారిని గుడికి చేర్చారు. ముందుగా గండొర్రె గుట్ట వద్ద కార్తీక రాజు, కాటపురాజు, చీకటి రాజుకు పూజలు చేశారు. అనంతరం నాగులమ్మను డోలు వాయిద్యాల నడుమ తీసుకొస్తూ, మార్గ మధ్యలోని పాలమాకు ఒర్రె వద్ద వనదేవతకు పూజలు నిర్వహించారు. నాగులమ్మతో వనదేవతకు వేడుకగా ఎదుర్కోలు జరిపించి, నాగులమ్మ, వనదేవతలను గుడి ప్రాంగణంలోని గద్దెలపై ప్రతిష్ఠించి గుడి నింపారు. చుంచుపల్లిలోని కొమురం వంశీయుల ఇంటి నుంచి అవిరేణి కుండలను తీసుకొచ్చి గుడి వద్ద ప్రతిష్ఠించారు.
రాత్రి ఆనవాయితీ ప్రకారం వడ్డెలు, పూజారులు ప్రత్యేక పూజలు చేసి, 12:05 గంటలకు ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం నాగులమ్మ-పగిడిద్దరాజుకు కల్యాణం జరిపించారు. జాతరలో ప్రధాన ఘట్టమైన నాగులమ్మ గద్దెకు చేరడాన్ని నిండు జాతరగా పరిగణించి భక్తజనం, నాయకులు పూజల్లో పాల్గొన్నారు. శుక్రవారం మొక్కు చెల్లింపులుంటాయని పూజారులు తెలిపారు. ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ అధ్యక్షుడు బాడిశ రామకృష్ణస్వామి, ప్రధాన పూజారి బాడిశ నాగరమేశ్, కొమురం ధనలక్ష్మి, బాడిశ నవీన్, నాగలక్ష్మి, సోడి శ్రీను, మడకం రమేశ్, మడకం లక్ష్మయ్య, సోడి సత్యం, గిరిజన కుల పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.