ఖిలావరంగల్ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)లో జరుగుతున్న శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గోపి అన్నారు. గురువారం వరంగల్ డీఆర్డీఏ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు ఇస్తున్న శిక్షణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే శిక్షణ పొందుతున్న యువతకు కావలసిన మౌలిక సదుపా యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు కేవలం సేల్స్ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా నిష్ణాతులుగా తయారు చేసే విధంగా శిక్షణ ఇవ్వాలన్నారు.
యువత తమ సందేహాలను నివృత్తి చేసుకుంటూనే ప్రతిది సూక్ష్మంగా పరిశీలించాలన్నారు. శిక్షణలో భాగంగా వివిధ రంగాల్లో పని చేస్తున్న హెచ్ఆర్తో కూడా ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు. అనంతరం శిక్షణలో భాగంగా నిర్వహించిన పోటీలో గెలుపొందిన యువకులకు కలెక్టర్ బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సంపత్రావు, అంజలి, సిబ్బంది పాల్గొన్నారు.