సుబేదారి, నవంబర్ 28 : లక్ష రూపాయల బెట్టింగ్లో గెలిస్తే రెండు లక్షలు, రెండు లక్షలకు నాలుగు లక్షలు, నాలుగు లక్షలకు, ఎనిమిది లక్షలు ఇలా బెట్టింగ్ ఆటగాళ్లకు ఆన్లైన్లో మెసేజ్ పంపుతాడు. గేమ్ మీడియేటర్గా గేమ్ ఆపరేట్ చేస్తాడు. చదివింది నాలుగో తరగతి మాత్రమే.. కానీ, టెక్నాలజీపై పట్టు సాధించాడు. అంతర్ రాష్ట్ర బుకీతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్లో కమీషన్ మీడియేటర్గా ఉండి కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా కొనసాగించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఎంతకాలం నుంచి ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు అనే కోణంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు కూపీలాగారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపురానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని అడ్డాగా చేసుకుని అంతర్ రాష్ట్ర ఆన్లైన్ బెట్టింగ్ బుకీతో పరిచయాలు పెంచుకున్నాడు. చాలా కాలం నుంచి ఆన్లైన్లో క్రికెట్, మూడు ముక్కలాట బెట్టింగ్ నడుపుతూ రోజుకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలుస్తున్నది.
బెట్టింగ్ పేమెంట్ అంతా వెబ్సైట్ నుంచే..
సదరు వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్లో ఆరితేరాడు. గేమ్స్ ఆపరేట్ చేస్తూ మధ్యవర్తిగా చేతికి మట్టి అంటకుండా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈ బెట్టింగ్ అంతా కూడా అంతర్ రాష్ట్ర బుకీ వెబ్సైట్ నుంచి నడుస్తున్నది. తెలిసిన వాళ్లను ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేయిచి, వారికి అకౌంట్ ఓపెన్ చేయిస్తాడు. ఇష్టమైన గేమ్స్, క్రికెట్, మూడుముక్కలు ఆడడానికి వెబ్సైట్ నుంచి వారి స్మార్ట్ఫోన్కు యూజర్ ఐడీ, పాస్వర్డ్ పంపించి, లింకు కలుపుతాడు. బెట్టింగ్ గేమ్ స్టార్ట్ కాకముందే వెబ్సైట్ అకౌంట్లోకి గేమ్ను బట్టి డబ్బులు డిపాజిట్ చేయాలి. క్రికెట్, మూడుముక్కలాటలో గెలిచినవారికి డబ్బులు వెంటనే వెబ్సైట్ అకౌంట్ నుంచి వారి అకౌంట్లోకి జమచేస్తాడు. ఒక్కో గేమ్కు కమీషన్గా 20 శాతం తీసుకుంటున్నట్లు తెలిసింది.
20 బ్యాంకు ఖాతాలు.. ఆరు సెల్ఫోన్ల నుంచి ఆపరేట్
పోలీసులకు పట్టుబడిన గోపాల్పూర్కు చెందిన వ్యక్తి బెట్టింగ్ గేమ్లో ఆరితేరాడు. 20 బ్యాంకు ఖాతాలతో లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. మహారాష్ట్రకు చెం దిన బెట్టింగ్ బుకీతో సంబంధాలు పెట్టుకుని అతడి వె బ్సైట్ ద్వారా ఈ బెట్టింగ్ దందా నడిపిస్తున్నాడు. గేమ్ లో ఎంతమంది పాల్గొంటే అంతమంది నుంచి ఈ మాయగాడు ప్రతి ఆటలో 20 శాతం చొప్పున కమీష న్ తీసుకుంటాడు. ఆరు సెల్ఫోన్ల నుంచి ఆపరేట్ చే స్తూ దందా కొనసాగిస్తున్నాడు. ఇలా రోజుకు లక్షల రూ పాయల కమీషన్ పేరుతో డబ్బులు సంపాదిస్తున్నాడు.
అదుపులోకి తీసుకున్న పోలీసులు!
గోపాలపురానికి చెందిన ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుడిని వారం రోజుల క్రితం కేయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతడి నుంచి సుమారు రెండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నటు సమాచారం. అతడికి మహారాష్ట్రకు చెందిన ఆన్లైన్ బెట్టింగ్ బుకీతో సంబంధం ఉందని పోలీసుల విచారణలో విచారణలో తెలిసింది. కేయూ పోలీసులు మహారాష్ట్రకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నటు సమాచారం. వీరిద్దరిని పోలీసులు సోమవారం అరెస్టు చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.