సంగెం, జనవరి 25 : అర్హులైన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కలెక్టర్ గోపి కోరారు. మంగళవారం మండలంలోని గుంటూరుపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. వ్యాక్సినేషన్ వివరాలను వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే సక్రమంగా చేస్తున్నారా? లేదా అని ప్రజలను అడిగారు. అలాగే పల్లెప్రకృతి వనం, జీపీ నర్సరీని పరిశీలించారు. ఆశాలపల్లి, గవిచర్ల గ్రామాల్లోని పల్లెప్రకృతివనం, జీపీ నర్సరీలు, డంపింగ్యార్డులు, వైకుంఠధామాలు, రైతు వేదికను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పల్లెప్రకృతి వనాల్లో వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో గ్రంథాలయాల కోసం అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఎం సంపత్రావు, డీఎంహెచ్వో వెంకటరమణ, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, సర్పంచ్లు రాజేశ్వరి, కిశోర్యాదవ్, దొనికెల రమ, ఎంపీడీవో మల్లేశం, మాజీ ఎంపీటీసీ దొనికెల శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలి..
ఖిలావరంగల్ : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ ఏర్పాటులో ఓటర్లదే కీలకపాత్ర అన్నారు. ఎంతో విలువైన ఓటు హక్కు కల్పించేందుకు ప్రతి యేడు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తున్నదన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఓటు ప్రాధాన్యతపై నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంశాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ సంపత్రావు, డీఈవో వాసంతి, ఏవో విశ్వనారాయణ, ఎలక్షన్ సూపరింటెండెంట్ జగదీశ్వర్, డీటీ సుభాన్ తదితరులు పాల్గొన్నారు.