ఖిలావరంగల్ : మత్స్యకారులు, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీకి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ గోపి తెలిపారు. శుక్రవారం కలెక్టరేటర్లో వివిధ బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా ఏర్పడిన తర్వాత 113 బ్రాంచీల్లో 31 బ్యాంక్లతో లీడ్ బ్యాంక్ ద్వారా జిల్లా క్రెడిట్కార్డు ప్లాన్ అమలు చేస్తున్నామన్నారు. జూన్ మాసంలో 1316.64 కోట్లుకు గాను 844.38 కోట్లు రుణాలను అందించామన్నారు. పరిశ్రమలకు 493.38 కోట్లు నిధులకు గాను 140.03 కోట్ల రుణాలు అందించామన్నారు. అలాగే ప్రాధాన్యత రంగాలకు 2446. 66 కోట్లకు గాను 1238.13 కోట్లు లక్ష్యాలను పూర్తి చేశామన్నారు.
ఎకనామికల్ సపోర్టు స్కీంల మీద ఎక్కువగా దృష్టి పెట్టాం..
ఎకనామికల్ సపోర్టు స్కీంల మీద ఎక్కువగా దృష్టి సారించినట్లు నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పీఎంఈజీపీ పథకమైన కుటీర పరిశ్రమల రుణాల టార్గెట్ రీచ్ కావడం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా వరంగల్ జిల్లాలో పాడి గెదేల పంపిణీ పథకం కూడా తీసుకువచ్చామన్నారు. 135 వేల మెట్రిక్ టన్నుల గోదాములు నర్సంపేట నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్నాయనన్నారు. ఈ ఏడాది వాటిని ఉపయోగంలోకి తీసుకువస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, ఎల్డీఎండీ సత్యజిత్, యూబీఐ డీజీఎం శంకర్లాల్, కెనరా బ్యాంక్ రీజినల్ మేనేజర్ జోషి, ఐఓబీ ఆర్ఎం అశోకన్, ఇతర రీజినల్ బ్యాంకు మేనేజర్లు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.