కంప్యూటర్, ఫోన్లే ప్లే గ్రౌండ్లు
ఆటపాటల్లో మునిగితేలుతున్న చిన్నారులు
మైండ్ గేమ్స్తో ఆలోచనలకు పదును
రూబిక్స్క్యూబ్, సుడోకు, పజిల్స్పై ఆసక్తి
అలనాటి ఆటలతోనూ కాలక్షేపం
ఎప్పుడూ చదువే కాకుండా.. ఆటపాటలుంటేనే పిల్లలు చురుగ్గా ఉంటారు. ఈ మాయదారి కరోనాతో చిన్నారులు ఇటు స్కూల్కు, అటు మైదానాలకు దూరమై ఇల్లే లోకంగా గడుపుతున్నారు. లాక్డౌన్తో కాలు బయట పెట్టలేని పరిస్థితుల్లో ఇంటినే ఇండోర్ స్టేడియంగా మార్చుకుని ఆటలాడుకుంటున్నారు. అష్టాచెమ్మా, అంత్యాక్షరి లాంటి అలనాటి ఆటలతో కొందరు కాలక్షేపం చేస్తుంటే.. ఇంకొందరు రొటీన్ గేమ్స్ను పక్కన పెట్టి ఆలోచనలకు పదునుపెట్టే రూబిక్స్ క్యూబ్, సుడోకు, పజిల్స్, మ్యాచింగ్ గేమ్స్ లాంటి మైండ్గేమ్స్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అవుట్డోర్కు వెళ్లి ఫిజికల్ గేమ్స్ ఆడే అవకాశం లేకపోవడంతో పిల్లలు ఇలాంటి గేమ్స్పై ఆసక్తి చూపేలా తల్లిదండ్రులు సైతం ప్రోత్సహిస్తున్నారు.
హన్మకొండ చౌరస్తా, మే 25 : లాక్డౌన్ సమయమంతా ఇంట్లోనే కూర్చుని రకరకాల ఆటలు ఆడుకుంటూ పిల్లలు మెదడుకు పదును పెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఎన్నో రకాల మైండ్గేమ్స్తో తెలివితేటలు పెంచుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా మూతపడిన స్కూళ్లు ఇప్పట్లో తెర్చుకునే అవకాశం లేకపోవడంతో పిల్లలు ఇంట్లోనే చదువుతో పాటు ఆటలాడేస్తున్నారు. ఇక ఇప్పట్లో బయటికి వెళ్లి ఆడకునే రోజులు కనిపించకపోవడంతో మారిన కాలంతో పాటు పిల్లల ఆలోచనలు కూడా పాదరసంలా పనిచేస్తూ ప్రతి రంగంలో తమ ప్రత్యేకత చాటుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆటల్లో రెండు రకాలుంటాయి. బ్రెయిన్ గేమ్స్, ఫిజికల్ గేమ్స్. అయితే ప్రస్తుతం చిన్నారుల నుంచి యువతరం వరకు ఎక్కువగా ఫిజికల్ గేమ్స్ కంటే బ్రెయిన్ గేమ్స్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. దానికి తగ్గట్లుగానే అందుబాటులోకి చాలా రకాల బ్రెయిన్ గేమ్స్ వస్తున్నాయి.
ఇల్లే లోకంగా..
ఒకప్పుడు చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ సమయం దొరికితే ఎక్కువగా శారీరక సామర్థ్యం పెంచే ఆటలు ఆడేందుకు ఆసక్తి చూపేవారు. లాక్డౌన్తో బయటకు వెళ్లి మైదానాల్లో ఆటలు ఆడే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు పిల్లలు, పెద్దలు అందరూ ఇంట్లోనే ఆటలతో ఎంజాయ్ చేస్తున్నారు. మానసిక ఆలోచనల్లో మార్పులు తీసుకొచ్చి, ఎలాంటి పనినైనా ఈజీగా చేయాలంటే సమయస్ఫూర్తి, ఏకాగ్రత కచ్చితంగా అవసరం. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న విభిన్న ఆటలు పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని పెంచేవిగా ఉంటున్నాయి. ముఖ్యంగా పజిల్గేమ్స్, మ్యాచింగ్ గేమ్స్, సుడోకు వంటి వాటిపై పిల్లల్లో ఆసక్తి పెరుగుతున్నది.
యువతదీ అదే బాట..
ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత యువతరం కూడా ఎక్కువగా మొబైల్ గేమ్స్పై ఆసక్తి చూపిస్తున్నారు. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా వర్చువల్ పజిల్ గేమ్స్ని ఆడేస్తున్నారు. ఎక్కువ సమయం కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, సెల్ఫోన్స్కే కేటాయిస్తుండడం వల్ల అందులో మైండ్గేమ్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుంటూ, పజిల్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తూ ఆలోచనలకు పనిచెబుతున్నారు. పిల్లలకు మార్కెట్లో దొరికే మైండ్గేమ్స్ని ఆలోచన పెంచుకోవడానికి ఉపయోగిస్తే యువతరం అంతా టెక్నాలజీ ద్వారా అందుబాటులో ఉండే మైండ్ గేమ్స్ని వాడుతున్నారు. మైదానాల్లో ఆటల కంటే ఎక్కువ సమయం మైండ్ గేమ్స్ కోసమే కేటాయిస్తున్నారు.
అలనాటి ఆటలు..
ఆడటానికి సెల్ఫోన్, బోర్డ్ గేమ్స్ మాత్రమే ఉన్నాయా.. అవుట్ డోర్గేమ్స్ మించిన ఇండోర్ గేమ్స్ ఎన్నో ఉన్నాయి. ఇంట్లోనే ఆడుకునే మన పాత తరం ఆటలను ఈ తరానికి నేర్పించవచ్చు. అష్టాచెమ్మా, పైలా పచ్చీస్, కైలాసం (పాము-నిచ్చెన), గచ్చకాయలు, పులి-మేక, పుల్లాట, అంత్యాక్షరి, ఓన గుంటలు, క్యారమ్స్, చెస్, దాగుడు మూతలు ఇలా ఎన్నో ఆటలు ఉన్నాయి. వీటితో పాటు రూబిక్స్ క్యూబ్ సాల్వింగ్, సూడోకు.. ఫజిల్స్ వంటివి ఆడితే టైమే తెలియదు. బ్యాడ్మింటన్ కూడా ఆడవచ్చు.