వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి పట్టణ ప్రగతి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి పనులను గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. వరంగల్ మహానగరంలో పట్టణ ప్రగతిలో భాగంగా రూ.179.34 కోట్లతో 409 అభివృద్ధి పనులు మంజూరు చేశామని అన్నారు. ఇందులో 106 .44 కోట్లకు సంబంధించిన 259 పనులు మాత్రమే పూర్తికావడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
పురోగతిలో ఉన్న 31 అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మిగిలిన 119 పనులు వెంటనే ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రారంభించని పనులు సమీకృత మార్కెట్లు, డంపింగ్యార్డులు, స్ట్రామ్ వాటర్ డ్రైన్, పార్కులు, స్వచ్ఛ ఆటోల కొనుగోళ్లు ఉన్నాయని అన్నారు. మూడు ప్రాంతాలలో చేపట్టాల్సిన సమీకృత మార్కెట్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి ఫలాలు ప్రజలకు చేరేలా చర్యలు చేపట్టాలని అన్నారు. నిర్మాణంలో ఉన్న వైకుంఠధామాల పనుల్లో వేగం పెంచాలని అన్నారు. ప్రతి డివిజన్లో ఫాగింగ్ జరిగేలా ప్రణాళికలు చేయాలని వివరించారు.
బల్దియా భూముల పరిరక్షణలో భాగంగా అన్నింటికి ప్రహరీలను నిర్మించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ నాగేశ్వర్, సిటీ ప్లానర్ వెంకన్న, సీహెచ్వో సునీత, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్ యాదవ్, ఈఈలు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్రావు , రాజయ్య, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.