హైదరాబాద్ : దేశంలోనే కార్యకర్తలకు బీమా చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హన్మకొండ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యవతి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి నెలా కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మంచి సంప్రదాయాన్ని పాటిస్తున్న వినయ్ భాస్కర్ ప్రశంసనీయుడన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు అనుయాయుడిగా వినయ్ భాస్కర్ ఉండటం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు.
కొన్ని పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. వాటిని కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మొన్నటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకున్న తరహాలోనే రానున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ 60 లక్షల సభ్యత్వం గల పెద్ద పార్టీ అన్నారు. పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూస్తున్న పార్టీ టీఆర్ఎస్.
మనకు రావాల్సిన నిధులు, అభివృద్ధిలో బీజేపీ అన్యాయం చేస్తున్నదన్నారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నది. భూములు కేటాయించినా, మనకు హక్కుగా రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. ఇవ్వలేమని పార్లమెంటులోనే ప్రకటించారు. ఆంధ్రాలో భూమి కేటాయించకున్నా ఇచ్చారు. బీజేపీ మన రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా, ఇక్కడ మాత్రం ఆ పార్టీ నేతలు చిల్లరగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు.