హనుమకొండ చౌరస్తా, జనవరి 28: శ్రామికుల ఆశాజ్యోతి ఈ-శ్రమ్ కా ర్డులు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు సంఘటితరంగ కార్మికులతో సమానంగా ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో ఈ-శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అసంఘటితరంగ కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు వారికి అందజేయడమే ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం కూలీలకు ఈ-శ్రమ్ కార్డులు అందజేస్తున్నారు. ప్రభుత్వ పథకాల నుంచి సులభంగా ఉపాధిపొందే అవకాశాలను చూపుతున్నారు. ఈ పథకం కింద కార్మికులే కాకుండా సాధారణ నివాసితులు, తక్కువ ఆదాయ కుటుంబాలతో సహా విద్యార్థులు కూడా నమోదు చేసుకోవచ్చు..
ఈ-శ్రమ్ కార్డు అంటే ఏమిటీ..
ఈ-శ్రమ్ కార్డు అనేది కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక కార్డు. ఇది కార్మికుడు అసంఘటిత రంగంలోని వాడని రుజువు చేస్తుంది. ఇప్పుడు కార్మికులు తమ ప్రయోజనాలను పొందేందుకు పెద్దగా పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. దీన్ని చూపించడం ద్వారా అసంఘటితరంగ కార్మికులకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయోజనాలు అందుతాయి..
కార్డు ప్రయోజనాలు..
ఈ-శ్రమ్ కార్డు పొందిన కూలీలు దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందడం సులభమవుతుంది. డేటాబేస్లో వారికి సంబంధించిన డేటా వల్ల వారు పనిని సులభంగా పొందుతారు. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదైన కార్మికుడికి రూ.2 లక్షల ప్రమాదబీమా వర్తిస్తుంది. పోర్టల్లో నమోదైన కార్మికుడు ప్రమాదానికి గురైతే, మరణం లేదా పూర్తి వైకల్యం సంభవించినప్పుడు రూ.2 లక్షలు ఇస్తారు. అదే సమయంలో కార్మికుడు పాక్షికంగా అంగవైకల్యం కలిగి ఉంటే ఈ బీమాలో లక్ష రూపాయాలకు అర్హులు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..
ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు, రోజువారీ కూలీలు, వీధి వ్యాపారులు, గృహకార్మికులు, రిక్షాపుల్లర్లు, భవన నిర్మాణ కార్మికులు ఈ-శ్రమ్ కార్డు ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి వయస్సు 16 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. వర్కర్ స్వయంగా లేదా ఈ-శ్రమ్ పోర్టల్ https://eshram.gov.in ద్వారా కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) సందర్శించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇప్పటివరకు హనుమకొండ జిల్లాలో సుమారు 3 లక్షల మంది ఉంటే 1,36,343 లక్షల మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు.
ఈ-శ్రమ్లో పేర్లు నమోదు చేసుకోవాలి..కోలా ప్రసాద్, కార్మికశాఖ సహాయ కమిషనర్
అసంఘటితరంగ కార్మికులందరూ ఈ-శ్రమ్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. హనుమకొండ జిల్లాలో సుమారు 3 లక్షల మంది అర్హులు ఉంటే ఇప్పటివరకు 1,36,343 మంది పేర్లను నమోదు చేసుకున్నారు.18 నుంచి 59 ఏళ్లు ఉండి, ఆదాయపన్నుపరిధిలోకి రానివారు, పీఎఫ్, ఈఎస్ఐ లేని ప్రతి అసంఘటితరంగ కార్మికుడు ఈ-శ్రమ్లో పేరు నమోదు చేసుకోవాలి. ప్రమాదబీమా కింద రూ.2 లక్షలతో పాటు ఇతర ప్రయోజనాలు అందుతాయి.
కార్మికులకు ఎంతో ఉపయోగం..తాటి సత్యనారాయణ, శ్రమశక్తి అవార్డు గ్రహీత
అసంఘటితరంగ కార్మికులకు ఈ-శ్రమ్ కార్డు ఎంతో ఉపయోగకరం. ఈ కార్డు ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. అదే సమయంలో కార్మికుడు పాక్షికంగా అంగవైకల్యం కలిగి ఉంటే ఈ బీమా పథకం కింద లక్ష రూపాయాలు అందిస్తారు. శ్రామికుల ఆశాజ్యోతి ఈ-శ్రమ్ కార్డులు. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందరూ ఈ-శ్రమ్ కార్డు పొంది ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకోవాలి. దీనిని వినియోగిం చుకోవాలి.