హనుమకొండ, డిసెంబర్ 7 : ఉద్యోగుల విభజన ప్రక్రియ మొదలైన నేపథ్యంలో జాబితాను పారదర్శకంగా రూపొందించాలని హన్మకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యోగుల విభజనపై కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు పలు శాఖల అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విభాగాధిపతులు తమ శాఖల్లోని జిల్లాస్థాయి ఉద్యోగులకు సంబంధించిన వర్గీకరణ, సీనియారిటీ జాబితాను సత్వరమే రూపొందించాలని ఆదేశించారు. ఉద్యోగుల విభజన వివరాలను అదనపు కలెక్టర్కు సమర్పించాలని సూచించారు. 33 జిల్లాలతో రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్ వ్యవస్థ-2018కి అనుగుణంగా ప్రభుత్వం ఈ మార్గదర్శకాల ను రూపొందించిందని, వారిలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఉద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన ఉండాలని తెలిపారు. 70 శాతం కంటే ఎకువ సమస్య ఉన్న దివ్యాంగులు, మానసిక దివ్యాంగులైన పిల్లలున్న ఉద్యోగులు, కారుణ్య నియామకాల కింద నియమితులైన వితంతువులు, క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ సంబంధిత ఉద్యోగులకు విభజన సమయంలో ప్రాధాన్యమిస్తారని కలెక్టర్ వివరించారు. సస్పెన్షన్, శిక్షణ, సెలవు, ఫారిన్ సర్వీస్, డిప్యుటేషన్లో ఉన్నవారి సీనియారిటీ వివరాలు సైతం జాబితాలో చేర్చాలని ఆయన ఆదేశించారు. పాత జిల్లాల్లోని ఉద్యోగులు ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చే ఆప్షన్ల వారీగా వారిని ఉమ్మడి జిల్లాలోని కొత్త జిల్లాలకు కేటాయిస్తారని అన్నారు. జిల్లాస్థాయి పోస్టుల విభజన అనంతరం జోనల్, మల్టీ జోనల్ పోస్టుల వివరాలు కూడా సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జాబితాలను పూర్తిగా పారదర్శకంగా రూపొందించాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఆర్వో వాసుచంద్ర, డీఆర్డీవో శ్రీనివాస్కుమార్, సీఈవో వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.