వరంగల్ అర్బన్ : తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ళలోనే రాష్ట్ర ముఖచిత్రం మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ వానకాలం, వేసంగిలో ఒక్క వరి పంటే ఒక కోటి ఆరు లక్షల ఎకరాల పంట పండిందని, 3 కోట్ల టన్నుల ఉత్పత్తి సాధించామన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయితే మరో 25 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుందన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని ధర్మసాగర్, వేలెర్ మండలంలోని రాయ్గూడెం, పెద్ద పెండ్యాల, ఎలకుర్తి, ధర్మసాగర్, నారాయణగిరి, పీచర, వేలేర్, షోడశపల్లిలో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను మంత్రి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ ఎం. సుధీర్ కుమార్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టి. రాజయ్య, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు.
శోడషపల్లి రైతు వేదిక వద్ద నిర్వహించిన సభలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా రైతు వేదికల ప్రయోగం ఎక్కడా లేదన్నారు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయానికి, రైతులను సంఘటిత పరిచేందుకు, రైతుల తలరాత మార్చేవే రైతు వేదికలన్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖల ద్వారా ఆధునిక వ్యవసాయ సమాచారం, అవగాహన కల్పించడం కోసం నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా ఈ వేదికలను ఉపయోగిస్తామని తెలిపారు. ఆయిల్ పాం పంటలను పండిస్తే రైతులకు మరింత లాభం చేకూరుతుందని అన్నారు. ఇందుకోసం మెగా నర్సరీలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రైతు బంధు ద్వారా గత రెండు రోజులుగా రైతులకు పంట పెట్టుబడుల కింద వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నమని, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పథకం అన్నారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తి 17 శాతంగా నమోదు అయ్యిందని, ఇది ఒక రికార్డు అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత గోదాముల నిర్వహణ సామర్థ్యం పెంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ నియెజకవర్గానికి 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి మంత్రి హామీ ఇచ్చారు. భూముల విలువ రాష్ట్రంలో పెరిగిందని, నేను రైతు బిడ్డను అని చెప్పుకొనే స్థాయిలో రైతులు ఉండాలన్నారు. వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలని అప్పుడే అధిక లాభాలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.