వరంగల్ : టీఆర్ఎస్ను విజయపథంలో నడిపే బాధ్యత పార్టీ కార్యకర్తలదేనని.. అటువంటి పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హన్మకొండ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా తలవంచి నమస్కరిస్తున్నా. ఎగిరెగిరిపడ్డ వాళ్ళను ప్రజలు దభేల్మని పడేశారు. నేలకేసి కొట్టారు. పాల పొంగులా వాళ్ళ ఉబ్బు తీరా ఓడించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇవ్వని బీజేపీ నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి.
సిగ్గు లేకుండా, మన పార్టీ, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. రైల్వే ప్లాట్ఫారం మీద టీ అమ్మిన మోడీ ఆ రైల్వేను అమ్మేస్తున్నాడు. అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే, ఇక ఉద్యోగాలు వస్తాయా? రిజర్వేషన్లు ఉంటాయా? అని ప్రశ్నించారు. కన్నతల్లి లాంటి పార్టీ టీఆర్ఎస్. పార్టీ కార్యకర్తలకు పదవులు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు త్వరలోనే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. అందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
ఉగాది నుండి వరంగల్ మహానగరంలో ఇంటింటికీ మంచినీరు అందివ్వనున్నట్లు మంత్రి తెలిపారు. అంబేద్కర్ జయంతి రోజు ఈ నెల 14న ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారన్నారు. వేలాది కోట్లతో వరంగల్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్క కుటుంబానికి కనీసం 5 లక్షల లబ్ధి చేకూరే విధంగా స్కీంని త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయించే అభ్యర్థులు అందరినీ గెలిపించాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు.