వరంగల్ అర్బన్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో క్రైస్తవులకు ఆత్మ గౌరవం పెరిగిందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా అందుతున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నియోజకవర్గ పరిధిలో క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఎమ్మెల్సీ డి. రాజేశ్వరరావు నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు గ్యాదరి బాలమల్లు, ఎంపీ బండ ప్రకాష్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బొంతు రామ్మోహన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు ఉండాలని కోరుకునే గొప్ప మనసున్న నాయకులు. అందుకే మైనారిటీ వర్గాలను కూడా అందరికీ సమానంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అయితే కొన్ని పార్టీలు మతాల పేరుతో మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి వారికి తగిన బుద్ది చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుంది. ఉన్న నలుగురు నాయకులు నాలుగు దిక్కుల్లో పోతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పాటుపడే టీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు.