హనుమకొండ సబర్బన్, అక్టోబర్ 8: కాలానుగుణంగా వ్యవసాయ విధానాలూ మారుతున్నాయి. సంప్రదాయ సేద్యాన్ని వీడి ఆధునికతను అందిపుచ్చుకుంటున్న రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా మెట్ట పంటల్లో కలుపు నివారణ కోసం మల్చింగ్ షీట్లు వేయడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటు తెగుళ్లు, పురుగుల బెడద తీరి తక్కువ నీటితో పంట చేతికొస్తుంది. ప్రోత్సాహకంగా ప్రభుత్వం 50శాతం సబ్సిడీ కూడా ఇస్తుండడంతో రైతాంగం మల్చింగ్ విధానాన్ని అవలంబించేందుకు ఆసక్తి చూపుతున్నది.
ఒకప్పుడు వ్యవసాయం అంటేనే పాడి-పంటగా పిలిచేది. ఇప్పుడు ఇందులోంచి పాడి పూర్తిగా కనుమరుగై పోతోంది. యాంత్రికీకరణతో అన్నదాత నుంచి హలం దూరమైంది. పూర్తిగా యంత్రాలతోనే వ్యవసాయం ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మెట్ట పంటల్లో కలుపు మొక్కల నివారణకు గతంలో ఎడ్లతో చేలల్లో అరకలు తోలుకునే వారు. ఈ తర్వాత కూలీలతో మొక్కల పక్కన మిగిలిన గడ్డిని తీసేసేవారు. ఇప్పుడు దాని స్థానంలో మల్చింగ్ షీట్ పరిచే పద్ధతి వచ్చింది. దీని ప్రయోజనాలు తెలుసుకున్న కొందరు రైతులు ఈ మల్చింగ్ విధానం వైపు మొగ్గుచూపుతున్నారు. దీనికి తెలంగాణ సర్కారు కూడా కొంతమేర తోడ్పాటునందిస్తుండడంతో రైతులు మల్చింగ్ వేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రయోజనాలు బోలెడు
మెట్ట పంటల్లో మల్చింగ్ షీట్లను వేయడం వల్ల రైతులకు బహుళ ప్రయోజనాలున్నాయి. నీరు ఆదా నుంచి మొదలు చీడపీడల నిర్మూలన వరకు అనేక రకాలుగా రైతులకు లాభం చేకూరుతుంది. మెట్ట పంటల్లో ప్లాస్టిక్ మల్చింగ్ వేయడం వల్ల కలుపును 80శాతం వరకు నివారించవచ్చు. షీట్ కింద గడ్డి మొలిచినప్పటికీ సూర్యకిరణాలు పడక కిరణజన్య సంయోగక్రియ నిలిచిపోయి మొక్క షీట్ కిందనే మగ్గిపోతుంది. డ్రిప్ వల్ల సాగునీరు 50శాతం వరకు ఆదా అవుతుంది. మల్చింగ్ షీట్పై పడే సూర్యకిరణాల వల్ల రిఫ్లెక్ట్ అయి కొన్ని రకాల పురుగులు కంట్రోల్లో ఉంటాయి. భూమిలో తేమ శాతం కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. ఎరువులు నేరుగా కాకుండా డ్రిప్ ద్వారా వేస్తాం కాబట్టి వేసిన ఎరువులు సక్రమంగా వినియోగం అవుతాయి. భారీ వర్షాలు పడినప్పుడు కూడా మొక్కలు నీరు పట్టిపోయి చని పోకుండా నివారించవచ్చు. పంటలో దిగుబడి సైతం భారీగా పెరుగుతుంది. మల్చింగ్ విధానం వచ్చిన ప్రారంభ దశలో వరి పొట్టు, రంపపు పొట్టు, ఎండిన ఆకులు, ఎండు గడ్డి, కొబ్బరి పీచు, చెరుకు పిప్పి లాంటి వ్యర్థాలతో మల్చింగ్ చేసే వారు. క్రమంగా వీటి లభ్యత తగ్గి పోవడంతో ప్లాస్టిక్ మల్చింగ్ వచ్చింది. వర్షాల వల్ల భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. విత్తనాలు కూడా కొంతమేరకు ఆదా అవుతాయి. పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది.
మల్చింగ్ వేయడం ఇలా..
మెట్ట పంటల్లో కలుపు నివారణ కోసం వేసే ప్లాస్టిక్ మల్చింగ్లో అనేక రకాలున్నాయి. రకరకాల రంగులు కూడా ఉంటాయి. మనం వేసుకునే పంటలను బట్టి మల్చింగ్ షీట్లను ఎంపిక చేసుకోవాలి. ఇవి 7నుంచి మొదలు 200 మైక్రాన్ల వరకు అందుబాటులో ఉంటాయి. 1.5 నుంచి 4 ఫీట్ల వెడల్పుతో ఉంటాయి. ట్రాక్టర్తో ముందుగా బోదెలు చేసుకొని ఆ తర్వాత డ్రిప్ పైపును పరిచి దానిపై ఎక్కువగా వేడి వాతావరణం లేని సమయంలో మల్చింగ్ షీట్ను వేసుకోవాలి. గాలికి షీట్ లేవకుండా ఇరువైపులా మట్టిని ఎగదోయాలి. గతంలో రంధ్రాలు లేకుండా వచ్చేవి. ఇప్పుడు పంటలను బట్టి మనకు కావాల్సిన కొలతతో రంధ్రాలు చేసిన షీట్లను పలు కంపనీలు సరఫరా చేస్తున్నాయి. పంటలను బట్టి మల్చింగ్ పేపర్ వేసుకోవాలి. మన ప్రాంతంలో ముఖ్యంగా మిర్చి పంటకు ఎక్కువగా మల్చింగ్ను వినియోగిస్తున్నారు.
చాలా ప్రయోజనాలుంటాయి..
మెట్ట పంటలకు మల్చింగ్ చేయడం వల్ల రైతులకు బహుళ ప్రయోజనాలు ఉంటాయి. మొక్కల చుట్టూ ఉండే తేమ త్వరగా ఆవిరి కాకుండా ఉంటుంది. ఇప్పుడు రైతులు వ్యవసాయంలో ఎడ్లను వినియోగించడం లేదు. దీని వల్ల కలుపు నివారణ సమస్యగా మారింది. దీనికి మల్చింగ్ విధానం పెద్ద ఎత్తున మేలు చేస్తుంది. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి తీయవచ్చు.
– శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, హనుమకొండ
పంట ఆరోగ్యంగా ఉంటుంది..
మల్చింగ్ విధానం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. కూలీల కొరత కారణంగా కలుపు తీసేందుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో మాకు మల్చింగ్ విధానం ఎంతో మేలు కలిగిస్తున్నది. ఒక్క కలుపే కాకుండా ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. పంటల ఆరోగ్యంగా పెరుగుతుంది. కొన్ని రకాల చీడపీడలను కూడా ఖర్చు లేకుండా నివారించుకోగలుగుతున్నాం.
– సుధీర్, రైతు, కక్కిరాలపల్లి