హనుమకొండ సబర్బన్, మే 17 : రైతులు లాభాలు తెచ్చే పంటలేవో ఆలోచించి వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. వానకాలం పంటల సాగుపై మంగళవారం హనుమకొండలోని కొడం, కేఎల్ఎం ఫంక్షన్హాళ్లలో ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశాలకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారులతో క్షేత్రస్థాయి పరిస్థితులు, రైతులతో వారి అనుబంధం, ఉద్యోగ నిర్వహణలో సంతృప్తినిచ్చిన సందర్భాలను మంత్రి నిరంజన్రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అతి పెద్ద ప్రాజెక్టులన్నీ నిజాంసాగర్ నిర్మించిన తర్వాత కట్టినవేనని చెప్పారు. వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని.. రైతుల కోసం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతుబీమా పథకం అమలుచేస్తున్నదని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఏది పండించాలో, ఏది పండించకూడదో తెలుసుకొని సాగుచేస్తే అది లాభసాటి వ్యవసాయం అవుతుందని వివరించారు.
ఈజిప్ట్లో కోటి ఎకరాల్లో సాగు..
దేశ జనాభాలో 5శాతం మాత్రమే జీవించే ఈజిప్ట్లో కోటి ఎకరాల్లో భూమిసాగు చేస్తున్నారని, అక్కడి ప్రభుత్వం సూచన మేరకు రైతులు పంటలు పండిస్తారని మంత్రి తెలిపారు. మురుగునీటిని శుద్ధి చేసి ద్రాక్ష, పుచ్చకాయలు, కూరగాయలు పండిస్తున్నారని పేర్కొన్నారు. మొన్నటి వరకు ఇతర దేశాల మీద ఆధారపడిన ఈజిప్ట్.. నేడు యూరప్ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని చెప్పారు.
కేంద్రానికి ‘వ్యవసాయ విజన్’ లేదు..
కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ విజన్ లేదని, ఈ రంగంపై సరైన అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నదని మంత్రి విమర్శించారు. దేశంలో 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటే, వారి బాగోగులు చూడాల్సిన కేంద్రం చిన్నచూపు చూస్తూ కోట్లాది మంది భవిష్యత్ను అంధకారంలోకి నెడుతున్నదని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కేవలం నాలుగు కోట్ల జనా భా ఉన్న స్పెయిన్ దేశం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో 16శాతానికి ఎగబాకితే, 140కోట్ల జనాభా, 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న మన దేశం మాత్రం ఎగుమతుల్లో కేవలం 2శాతం వద్దే నిలిచిపోవడం సిగ్గుచేటన్నారు.
సరైన దిశలో నడిపించాలి..
రైతులను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ఎప్పుడూ ఉంటారు. గతంలో కొందరు వరి విషయంలో రైతులను మోసం చేశారని, కానీ మనం అధికారులు రైతులను సరైన దిశలో నడిపించాలి. రూ.3వేల కోట్ల నష్టం వస్తున్నా రైతుల కోసం సీఎం కేసీఆర్ వడ్లు కొనుగోలు చేస్తున్నారు. రైతులను లాభసాటి సాగుపై ముందుగానే సిద్ధం చేయా లి. తక్కువ పెట్టుబడితో ఆయిల్పామ్ ఎక్కువ దిగుబడి ఇస్తుంది. కొన్ని పార్టీలు రైతులను మభ్యపెట్టే హామీలు ఇస్తున్నాయి. వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వాళ్లు పాలించే రాష్ర్టాల్లో చేయనివి తెలంగాణలో ఎలా సాధ్యం. బీజేపీ, కాంగ్రెస్ కుట్రపూరిత హామీలను రైతు లు పట్టించుకోద్దు. రైతుల కోసం తెలంగాణ మాదిరిగా ఇన్ని సదుపాయాలు కల్పించాయా? ఎనిమిదేండ్ల కింద భూముల విలువ ఎంత, ఇప్పుడు ఎంత ఉందో చూడాలి. ఇదొక్కటే ఇవ్వాల్టి రైతుల, వ్యవసాయ పరిస్థితులకు నిదర్శనం.
వ్యవసాయానికి దశ, దిశ కేసీఆరే..
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి దశ, దిశ చూపారు. వ్యవసాయ శాఖకు బడ్జెట్లో రూ.30వేల కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రిదే. 1,450 మంది రైతుల ఆత్మహత్యలు జరిగిన నేపథ్యం నుంచి ఇవ్వాల అత్యంత వేగంగా రైతు ఆత్మహత్యలు తగ్గిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేంద్రం ప్రకటించింది. 30లక్షల బోర్లకు ఇవ్వాల నిరాటంకంగా కరంటు అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానిదే. ప్రతి రైతు వేదిక నిర్వహణకు రూ.9వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతువేదికలను పకడ్బందీగా నిర్వహించే అధికారులు రైతులకు సహకరించాలి. 2014లో 131 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, ఇవ్వాల 204లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి ఇచ్చే వాళ్లం. ఈ రోజు 141లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తున్నాం. 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంటలు పండిస్తున్నా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు మాత్రం వరి సాగు విషయంలో రైతులను తికమక పెడుతున్నారు.
లాభసాటి పంటలు వేయాలి
దేశంలో రైతులకు 24గంటల పాటు ఉచిత కరంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. సాగునీటితో పాటు ఎదురు పెట్టుబడులు కూడా ఇస్తున్నది సీఎం కేసీఆర్ ఒక్కరే. మన నేలలు అన్ని పంటలకు అనువుగా ఉంటాయి. రైతులు వరి మాత్రమే కాకుండా లాభాలు తెచ్చే పంటలు సాగుచేయాలి. ఈసారి మిర్చికి రూ.55వేలు పలికిందని ఆ దిశగా రైతులు ఆలోచన చేయాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటల వైపు రైతులను మళ్లించాలి. రైతులను చైతన్యపర్చడంలో అధికారులు కీలకంగా పనిచేయాలి. అందుకే ప్రతి 5వేల ఎకరాలకు ఒక ఏఈవోను కూడా నియమించాం. రైతును రాజును చేసే దిశగా మన వ్యవసాయం ఉండాలి.
సాగు కోసం రూ.3.75లక్షల కోట్లు ఖర్చు చేశాం
రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఏడేండ్లలో రూ 3.75 లక్షల కోట్లు ఖర్చు చేశారని, మూడుసార్లు గుజరాత్ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీ ఎంత ఖర్చుచేశాడో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. ఎరువులపై కేంద్ర భరిస్తున్న సబ్సిడీలు కూడా నాలుగైదు రాష్ర్టాల నుంచి వచ్చే పన్నుల నుంచేనని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను పూర్తిగా హరిస్తున్నదని, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ను బెదిరించి రాష్ర్టానికి రుణం అందకుండా చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏడెనిమిది నియోజకవర్గాలు మినహాయిస్తే అన్నిచోట్ల సాగునీరు అందుబాటులో ఉందని, కృష్ణా నది నీరు అందుబాటులో లేనందున కొన్ని ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో మొత్తం కోటీ 50లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి గాను కోటీ 45 లక్షల ఎకరాలు సాగవుతోందని, ఇందులో కోటీ 25లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని వివరించారు. అతి త్వరలో మిగతా భూములకూ సాగునీరు అందుతుందని వెల్లడించారు.
రైతులు మార్కెటింగ్, అధిక దిగుబడులను దృష్టిలో పెట్టుకొని పంటలు సాగు చేయాలని, వచ్చే రెండు మూడేళ్ల వరకు పత్తికి డిమాండ్ ఉంటుందని తెలిపారు. గోధుమల ఎగుమతిని ప్రధాని మోదీ నిలిపివేశారని, చిన్న చిన్న దేశాలు ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతులు చేస్తుంటే దాదాపు 40కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్న మన దేశం ఎగుమతులను నిషేధించడం గమనార్హమని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని రైతులకు చెప్పి చైతన్యం తీసుకురావాలన్నారు. సీఎం కేసీఆర్ ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపాన్ని సంపూర్ణంగా మారిస్తే, తెలంగాణ నుంచి వస్తున్న వరి ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం ప్రకటించడాన్ని రైతులు గమనించాలన్నారు. మన భూముల్లో భాస్వరం స్థాయి అవసరానికి మించి ఉన్నదని, దీనిని సరిచేసేందుకు ఫాస్పేట్ వినియోగించాలని సూచించారు. పంటల ఉత్పాదకతను పెంచలేక అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులు అమ్మే పరిస్థితి లేక కేంద్రం ఎగుమతులపై చేతులు ఎత్తేసిందని విమర్శించారు. కరంటు, నీళ్లు, రైతుబంధు, రైతుబీమా పథకాలు ఇస్తూ రైతులు నష్టపోవద్దని జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ను పరిశీలించి ఏయే పంటలు వేయాలో సలహా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ మార్కెట్ రిసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటుచేశారని తెలిపారు.
ఈక్రమంలో కందులు, ఆయిల్పామ్, పత్తి సాగు పెంచాలని కోరారు. తోతాపురి, మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, అరటి సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ అధికారులకు సూచించారు. పెట్టుబడులు తగ్గించి, ఉత్పాదకతను పెంచే దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. జూలై 15తర్వాత పత్తి వేయవద్దని సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని 2008 నుంచి కొట్లాడుతున్నామని, అప్పటి ఎంపీ వినోద్కుమార్ పార్లమెంట్లో మాట్లాడారని గుర్తుచేశారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 బీజేపీ మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పారని ఆరోపించారు. తమ పాలిత రాష్ర్టాల్లో చేయ చేతగాని కాంగ్రెస్.. తెలంగాణలో డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రైతులు అమాయకులని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయని, వాళ్లే మీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. వ్యవసాయంలో పంటలపై కోతులు చేస్తున్న దాడి కంటే రాజకీయ కోతులు చేస్తున్న దాడి ప్రమాదకరంగా ఉన్నదని మండిపడ్డారు. త్వరలో కోతుల సమస్య పరిష్కారానికి శ్రీకారం చుడతామన్నామన్నారు.
సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, శంకర్నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, జడ్పీ అధ్యక్షులు గండ్ర జ్యోతి, మారెపల్లి సుధీర్ కుమార్, కుసుమ జగదీశ్, పాగాల సంపత్రెడ్డి, అంగోత్ బిందు, జక్కు శ్రీహర్షిణి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కలెక్టర్లు గోపి, శశాంక్, భవేష్మిశ్రా, కృష్ణ ఆదిత్య, రాజీవ్గాంధీ హన్మంతు, శివలింగయ్య, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు ఎల్లావుల లలితా యాదవ్, పల్ల బుచ్చయ్య, ఇర్రి రమణారెడ్డి, బాలాజీనాయక్, బొల్లె భిక్షపతి, డీఏవోలు రవీందర్సింగ్, ఉషాదయాళ్, గౌస్ హైదర్, వినోద్కుమార్, ఛత్రునాయక్, విజయభాస్కర్, ఏడీఏ కేతిరి దామోదర్రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.