హనుమకొండ చౌరస్తా, మే 16: వేసవి శిక్షణా శిబిరాలతో మైదానాలు, అకాడమీలు, ఇండోర్ స్టేడియాలు కళకళలాడుతున్నాయి. సరిగ్గా వేసవి సెలవుల్లోనే కరోనా ముంచుకురావడంతో రెండేళ్ల పాటు బాలబాలికలు ఇళ్లకే పరిమితం కాగా, ఇప్పుడు చిన్నారులతో మళ్లీ బిజీబిజీగా మారాయి. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అంతటా శిక్షణ శిబిరాలు మొదలుకావడంతో హనుమకొండ జేఎన్ స్టేడియం సహా ఏ గ్రౌండ్లో చూసినా ప్రాక్టీస్ చేసే విద్యార్థులతో ఉదయం, సాయంత్రం సందడిగా ఉంటోంది. నెలాఖరు వరకు కొనసాగే ఈ క్యాంపుల్లో ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ ఇస్తూ మెళకువలు నేర్పుతుండడంతో ‘ఫ్యూచర్ ఛాంప్స్’లో జోష్ కనిపిస్తోంది.
రెండేళ్ల తర్వాత ఈసారి వేసవి క్రీడాశిక్షణా శిబిరాలు ఆరంభమయ్యాయి. అప్పుడు సమ్మర్ మొత్తం ఇంట్లోనే గడపిన చిన్నారులు ప్రస్తుతం మైదానాల బాటపట్టారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా క్రీడలు యువజన శాఖ ఈ నెల 2వ తేదీ నుంచి హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంతో పాటు అన్నిచోట్ల క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభించారు. పిల్లలకు వారికి ఇష్టమైన క్రీడల్లో ఎలాంటి సాధన లేక ఇంటికే పరిమితమైన విద్యార్థులతో ఇప్పుడు మైదానాలు బిజీబిజీగా మారాయి. గ్రామస్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచిత వేసవి క్రీడా శిబిరాలను నిర్వహిస్తోంది. విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం సుమారు వెయ్యిమందికి పైగా క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు.
విద్యార్థుల్లో జోష్..
వేసవి క్రీడా శిబిరాలు అనగానే పిల్లలకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఇప్పటివరకు వారిలో ఉన్న నిరాశ నిస్పృహలన్నీ తొలగిపోయాయి. రెండేళ్ల పాటు ఇళ్లకే పరిమితమై సెల్ఫోన్లు, ట్యాబ్లు, టీవీలతో గడిపిన బాలబాలికల్లో వేసవి సెలవులు నూతనోత్సాహం నింపాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా, అర్బన్ ఏరియా వారికి నామమాత్ర రుసుముతో శిక్షణ ఇస్తున్నారు. దీంతో జేఎన్ఎస్తో పాటు క్రీడామైదానాలు, పాఠశాలలు సందడిగా మారాయి. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు ఎండ తీవ్రత లేని సమయాల్లో శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 22 క్రీడాంశాల్లో ఈనెల 31వరకు శిక్షణ ఇస్తారు. అర్బన్లో 12 రూరల్ ప్రాంతాల్లో 10 వివిధ మండలాల పరిధిలో ఎంపిక చేసిన పాఠశాలల మైదానాల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థుల్లో క్రీడల జోష్ నెలకొంది. ఉల్లాసంగా.. ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని శిక్షణ తీసుకుంటున్నారు.
రిజర్వేషన్లోనూ..
ఆటల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలనుకునే వారికి ఉన్నత విద్య, ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఏటా జిల్లా నుంచి సుమారు 50మంది క్రీడాకారులు జాతీయ, రాష్ట్రస్థాయిలో సత్తాచాటి స్పోర్ట్స్ కోటాకు అర్హత సాధించేవారు. ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, పీజీలో సీట్లతో పాటు వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలు క్రీడా కోటాలో సాధించారు.
శిక్షణ శిబిరాలే పునాది..
భావి ఛాంపియన్లను తీర్చిదిద్దే వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు రెండేళ్ల తర్వాత మొదలవడంతో ఎక్కువమంది హాజరవుతున్నారు. ఎంతోమంది చిన్నారులు అరంగ్రేటం చేస్తున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన ఆటల్లో ప్రవేశం పొందాలంటే వేసవి శిక్షణ శిబిరాలే పునాది. ఇక్కడ ఓనమాలు దిద్దిన తర్వాత క్రీడాకారుడి ప్రతిభను బట్టి వివిధ స్థాయిల్లో జరిగే పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ శిబిరాలు భవిష్యత్లో జరగనున్న అ నేక క్రీడాంశాల్లో ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దనుంది.
జిల్లావ్యాప్తంగా 22 ఆటలు..
కొవిడ్ కారణంగా రెండేళ్లుగా ఉచిత వేసవి శిక్షణ క్రీడా శిబిరాలు నిర్వహించలేదు. ప్రస్తుతం నిబంధనల సడలింపుతో జిల్లాలో క్రీడా శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విద్యార్థులు ఆసక్తి చూపే క్రీడల ఆధారంగా జిల్లావ్యాప్తంగా ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను ఎంపిక చేశారు. హనుమకొండ జిల్లావ్యాప్తంగా 22 ఆటల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
అర్బన్లో 12, రూరల్ ప్రాంతాల్లో 10 క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, వాలీబాల్, రెజ్లింగ్, కబడ్డీ, లాన్టెన్నిస్, క్రికెట్, బాక్సింగ్ శిక్షణ ఇస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లోని ముల్కనూరు(కమలాపూర్)లో కిక్బాక్సింగ్, నీరుకుళ్ల(ఆత్మకూరు)లో వాలీబాల్, ధర్మసాగర్లో బాక్సింగ్, మర్రిపల్లిగూడెం(కమలాపూర్)లో టెన్నికాయిట్, ధర్మసాగర్లో హ్యాండ్బాల్, హసన్పర్తిలో కబడ్డీ, కొత్తకొండ(భీమదేవరపల్లి)లో కబడ్డీ, పరకాల, వేలేరులో కబడ్డీ శిక్షణ ఇస్తున్నారు.
శిబిరాలు చాలా ముఖ్యమైనవి..
మాది రెడ్డిపురం. కబడ్డీలో శిక్షణ పొందుతున్నా. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు చాలా ముఖ్యమైనవి. వేసవి శిక్షణ శిబిరంలో కోచ్లు మంచి శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు ఈ ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. అందరికీ చాలా అవసరం కూడా. ఇక్కడ శిక్షణ పొందడం ద్వారా మెళకువలు తెలుస్తాయి.
– బానోత్ నవీన్, కబడ్డీ ఆటగాడు
సింథటిక్ ట్రాక్ ఎంతో ఉపయోగకరం..
నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. అథ్లెటిక్స్ క్రీడాకారులకు సింథటిక్ ట్రాక్ ఎంతో ఉపయోగకరం. జేఎన్ఎస్లో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయడం అందరికీ అదృష్టం. 100, 800 మీటర్ల పరుగు పందెంలో రాణించి ప్రతిభ చాటడమే లక్ష్యంగా ముందు కెళ్తున్నా. ఇందుకోసం జేఎన్ఎస్లో శిక్షణ తీసుకుంటున్నా. తక్కువ టైంలో రీచ్ కావడానికి మెళకువలు నేర్చుకుంటున్నా.
– సుప్రియ, జిమ్నాస్టిక్స్
సెల్ఫోన్లు, టీవీలకు పరిమితం కావొద్దు..
ఈతరం పిల్లలు సమయం దొరికినప్పుడల్లా సెల్ఫోన్లు, టీవీ చూస్తున్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. పిల్లలకు ఇష్టమైన క్రీడల్లో శిక్షణ పొంది రాణించాలి. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అందించే సమ్మర్ శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. కరోనా కారణంగా రెండేళ్లు నిర్వహించలేదు. ఈసారి వెయ్యిమంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– గుగులోత్ అశోక్కుమార్, డీవైఎస్వో