కాజీపేట, మే 21 : కాజీపేటలోని రైల్వే స్టేడియం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో రైల్వే శాఖ కాజీపేటలో రైల్వే స్టేడియాన్ని నిర్మించింది. కొంతకాలంగా రైల్వే అధికారుల నిర్వహణ సరిగా లేకపోవడంతో స్టేడియం పూర్తిగా శిథిలావస్థకు చేరిం ది. ఒకప్పుడు ఉదయం, సాయంత్రం క్రీడాకారులతో కిటకిటలాడిన ఈ స్టేడి యం కొంత కాలంగా వెలవెలబోతోంది. గతంలో గాలి దుమారానికి స్టేడియం స్టేజీ పై కప్పు రేకులు ఎగిరిపోయాయి. గేట్లు, ప్రేక్షకులు కూర్చునేందుకు నిర్మించిన మెట్లు, మూత్రశాలలను ఆకతాయిలు ధ్వంసం చేశారు. రైల్వే ఉన్నతాధికారులు కాజీపేట రైల్వే జంక్షన్కు పలుమార్లు తనిఖీలకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ దయాకర్, స్థానికులు, రైల్వే ట్రేడ్ యూనియన్ నాయకులు రైల్వే స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని విన్నవించారు.
దీంతో గత సంవత్సరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రూ.46 లక్షలు మంజూరు చేయడంతో కాంట్రాక్టర్లు ఇటీవల స్టేడియం అభివృద్ధి పనులను చేపట్టారు. స్టేడియం స్టేజీకి నాణ్యత కలిగిన పై కప్పు వేశారు. నూతన గేట్ల ఏర్పాటు, ప్రేక్షకులు కూర్చొని క్రీడలను వీక్షించే మెట్లకు మరమ్మతులు చేసి రంగులు వేశారు. మెట్లపై షెడ్లను నిర్మించారు. మూత్రశాలు, క్రీడాకారుల డ్రెస్సింగ్ రూం, తాగునీటి వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం స్టేడియం మరమ్మతు పనులు వేగంగా జరుగుతుండడంతో క్రీడాకారుకాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్టేడియానికి మంచి రోజులు..
రైల్వే స్టేడియం అభివృద్ధికి రూ.46 లక్షలు మంజూరు చే యడంతో పనులు పూర్తికావొస్తున్నాయి. స్టేడియం అభివృద్ధితో రైల్వే ఉద్యోగుల పిల్లలు క్రీడలను ప్రాక్టీస్ చేయడానికి, పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఏర్పడింది. గతంలో స్టేడియంలో శిక్షణ పొందిన అనేక మంది క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద రైల్వే ఉద్యోగాలు పొందారు. మళ్లీ స్టేడియం అభివృద్ధితో మంచి రోజులొచ్చాయి.
– డాక్టర్ నల్లెల్ల శ్రీనివాస్, ఫుట్బాల్ కోచ్
సద్వినియోగం చేసుకోవాలి..
అసాంఘిక కార్యకలాపాలకు ఒకప్పుడు నిలయంగా మారిన స్టేడియం నేడు అభివృద్ధి పనులతో కళకళలాడడం ఆనందంగా ఉంది. రైల్వే ఉద్యోగుల పిల్లలతో పాటు స్థానిక యువకులు స్టేడియాన్ని వినియోగించుకుంటూ నైపుణ్యం ఉన్న క్రీడల్లో రాణించాలి. అందుకు తగినట్లు రైల్వే అధికారులు తోడ్పాటు అందించాలి.
– మాట్ల శ్రీనివాస్, ఫైర్ పీసీ,రైల్వే సీనియర్ క్రీడాకారుడు