వరంగల్ అర్బన్ : నలుగురు సభ్యుల బైక్ దొంగల ముఠాను గుండాల పోలీసులు శనివారం అరెస్టుచేశారు. వారి నుంచి రూ. 11.50 లక్షల విలువైన 19 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వ్యక్తులు జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కాంచన్పల్లి గ్రామానికి చెందిన బుంగా మహేశ్(22), ఇదే గ్రామానికి చెందిన అమృతం రాజేష్(21), రఘునాథపల్లి గ్రామానికి చెందిన సమను శివాజీ(29), ములుగు జిల్లా గోవిందరావుపేట గ్రామానికి చెందిన లక్కమల్ల రవి(34).
వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఫంక్షన్లలో క్యాటరింగ్ పనులు చేసే వీరంతా స్నేహితులయ్యారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు నేరాల బాట పట్టినట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం గుండాల మండల కేంద్రంలో స్టేషన్ ఘన్పూర్ ఏఎస్పీ అభినవ్ గైక్వాడ్ నేతృత్వంలో గుండాల ఎస్ఐ తిరుపతి వాహన తనిఖీలు చేపట్టగా నిందితులు పట్టుబడ్డట్లు సీపీ తెలిపారు.