నర్సంపేట, జనవరి 25 : జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ జుర్రు రాజు కోరారు. మంగళవారం నర్సంపేటలోని రెండో వార్డులో జ్వర సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడో వేవ్ తీవ్రత దృష్ట్యా ప్రజలు కరోనా లక్షలతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సోకిన రోగులకు మందులను అందిస్తున్నదని తెలిపారు. కరోనా సోకిన వారు ఇండ్లలోనే ఐసొలేషన్లో ఉండాలని కోరారు. వ్యాధి తీవత్ర ఎక్కువైతే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలన్నారు.
నర్సంపేట రూరల్ : మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటా జ్వర సర్వే కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. మంగళవారం మండలంలోని దాసరిపల్లి, కమ్మపల్లి, భాంజీపేట, చంద్రయ్యపల్లి, రాజేశ్వర్రావుపల్లి, రాజుపేట, ముత్తోజీపేట, ఇటుకాలపల్లి గ్రామాల్లో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు జ్వర సర్వే చేశారు. ఈసందర్భంగా జ్వరంతో బాధపడుతున్న పలువురికి వైద్య సిబ్బంది మెడిసిన్ కిట్లను అందజేశారు. గ్రామాల్లో జరుగుతున్న సర్వేను ప్రజాప్రతినిధులు పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్లు శ్రీనివాస్, రంగారెడ్డి, పూలమ్మ, లలిత, యువరాజ్, దస్రూ, శ్రీనివాస్రెడ్డి, మండల రవీందర్, వైద్య, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట : నర్సంపేటలోని ఏరియా దవాఖానలో క రోనా పరీక్షలకు ప్రజలు తరలి వస్తున్నారు. ప్రతి ఇంటిలో జ్వర బాధితులు పెరిగిపోతుండడంతో కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. పాజిటివ్గా నిర్ధారణ అయినవారు హోం ఐసొలేషన్లో ఉంటూ మందులు వాడుతున్నారు. వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలితే మందుల కిట్లను అందిస్తున్నారు.