భూపాలపల్లి : ఫెర్టిలైజర్స్ డీలర్లు ఎరువుల అమ్మకాలను ఆన్లైన్లోనే జరపాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో డీబీటీ పీఓఎస్ ఆండ్రాయిడ్ వెర్షన్పై ఫెర్టిలైజర్స్ డీలర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతినిధులు డీలర్లకు డీబీటీ పీఓఎస్ ఆండ్రాయిడ్ వెర్షన్పై శిక్షణ ఇచ్చారు.
ఆండ్రాయిడ్ మోబైల్లో అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని, ఫింగర్ ఫ్రింట్ స్కానర్ ద్వారా ఎరువుల విక్రయించే విధానాన్ని ప్రొజెక్టర్ ద్వారా కోరమండల్ ప్రతినిధులు డీలర్లకు వివరించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ పాత మిషన్ల ద్వారా, మాన్యువల్ పద్దతిలో ఎరువులు విక్రయించవద్దని అన్నారు. దీంతో గ్రౌండ్ స్టాక్ వివరాలు ఆన్లైన్లో కనిపించవని , తద్వారా కంపెనీ నుంచి ఎరువులు రావన్నారు.
ఎప్పటికప్పుడు మన వద్ద ఉన్న ఎరువుల స్టాక్ను కంపెనీ ప్రతినిధులు ఆన్లైన్లో చూస్తారని, మాన్యువల్గా ఎరువులను విక్రయిస్తే మన వద్ద స్టాక్ అయిపోతుందని, ఆన్లైన్లో స్టాక్ ఉన్నట్లే కనిపిస్తుందని, దీంతో మనకు ఎరువులు సరఫరా చేయరని గుర్తు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 2500 టన్నుల యూరియా, 1200 టన్నులు డీఏపీ, 300 టన్నులు పొటాషియం, 1800 టన్నులు కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయన్నారు.
డీలర్లు ఈ కొత్త వెర్షన్ అప్లికేషన్ను మీ ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఫింగర్ ఫ్రింట్ స్కానర్ ద్వారా రైతులకు ఎరువులు అమ్మకం జరుపాలని, ప్రతి డీలర్కు కోరమండల్ కంపెనీ వారు ఫింగర్ ఫ్రింట్ స్కానర్ ను ఉచితంగా అందజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ కంపెనీ ప్రతినిధులు, జిల్లాలోని ఫెర్టిలైజర్స్ డీలర్లు పాల్గొన్నారు.