వరంగల్ చౌరస్తా : కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రాపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ జిల్లా నాయకులు సోమవారం వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు రవి మాట్లాడుతూ సంవత్సరం కాలంగా రైతులు ఆందోళనలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పాటుగా, రైతుల పై దాడులకు దిగడం, అక్రమ కేసులు నమోదు చేయడం శోచనీయమని అన్నారు.
రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా రైతులను ఏకం చేసి, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు దారపోయడానికి కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ రైతుల తరుఫున పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.