వరంగల్: ఎన్ఐటీ వరంగల్లో వినికిడి, మాట్లాడటంలో లోపం ఉన్న విద్యార్థుల కోసం ఒక అధునాతన యానిమేషన్ వర్క్షాప్ను నిర్వహించారు. దీనికి ఏథీరం( ATheorem ) యానిమేషన్ స్టూడియోస్ సీఈవో అరుణ్ కుమార్ రాపోలు నేతృత్వం వహించారు. ఒక సామాజిక ప్రయోజనంతోపాటు యానిమేషన్పై అవగాహన పెంచడం, అలాగే ఈ రంగంలో ఉన్న వివిధ కెరీర్ అవకాశాల గురించి విద్యార్థులకు తెలియజేయడం కోసం, తద్వారా యానిమేషన్లో పిల్లల్లో ఆసక్తిని పెంపొందించడానికి ఈ వర్క్షాప్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్.ఎన్.వి.రమణరావు హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఏథీరం సంస్థ ప్రయత్నాలను ప్రశంసించిన ఆయన.. అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దృఢంగా నిశ్చయించుకుంటే ప్రతిదీ సాధ్యమేనని విద్యార్థులకు చెప్పారు. గౌరవ అతిథిగా వచ్చిన ప్రొఫెసర్.శివశర్మ కూడా విద్యార్థులందరినీ ప్రశంసలతో ప్రోత్సహించారు. అదే విధంగా యువత ప్రతిభకు పెంపొందించేందుకు కృషి చేస్తున్నందుకు శ్రీ వెంకటేశ్వర పాఠశాల , మల్లికాంబ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎన్ఐటీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్ఐటీ రిజిస్ట్రార్ ఎస్. గోవర్ధన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఎన్ఐటీ కళాశాల గురించి సమగ్ర సూచనలు ఇచ్చారు, మరింత అధునాతన కోర్సులు సిద్ధం చేయాలని ఏథీరం సంస్థను ప్రోత్సహించారు. కెరీర్ విషయంలో ఎన్ఐటీ సహాయం, సలహాలను ఉంటాయని విద్యార్థులకు హామీ ఇచ్చారు.
ఏథీరం సీఈవో అరుణ్ కుమార్ రాపోలు మాట్లాడుతూ.. కళ మరియు యానిమేషన్ రంగాలలో సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా యువకుల ఆలోచనా విధానం మెరుగవుతుందన్నారు. సృజనాత్మకతకు హద్దులు లేవని నొక్కిచెప్పిన ఆయన.. “నిశ్చయానికి వైకల్యం లేదు” అంటూ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు.