ఆదిలాబాద్ : ఎస్టీ జాబితాలో నుంచి లంబాడాలను తొలగిస్తామని చెప్పి.. ఆదివాసీలను మోసగిస్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం సమావేశమైన నాయకులు ఎంపీ తీరును తప్పుపడుతూ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఈ మేరకు నేతలు మాట్లాడుతూ.. లంబాడా ‘హటావో.. ఆదివాసీ బచావో’ నినాదంతో తుడుం దెబ్బ నాయకత్వంలో మొదట కాంగ్రెస్తో జత కట్టిన సోయం బాబురావు.. ఆ తర్వాత ఎంపీ టికెట్ కోసం బీజేపీతో జతకట్టారని ఆరోపించారు.
తన రాజకీయ లబ్ధి కోసం తుడుందెబ్బను వాడుకుంటూ ఆదివాసీలను మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిసారి ఏదో రాజకీయ పార్టీకి తుడుం దెబ్బను తాకట్టు పెడుతూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. లంబాడాలను తొలగించడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ అమాయక ఆదివాసీలను మోసగించేందుకు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. అటు లంబాడాలను తొలగించడమే లక్ష్యంగా పోరాడిన సోయం బాపురావు ఇప్పుడు లంబాడ నాయకుడైన రాథోడ్ రమేశ్ లంబాడాల టైగర్ అంటూ.. తాను ఆదివాసీల టైగర్ అంటూ మాట్లాడడం సిగ్గు చేటన్నారు.
లంబాడా హటావో ఉద్యమాన్ని పక్కదోవ పట్టించి, వారితో దోస్తీ చేస్తున్న సోయం బాపురావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఖండాల ఎంపీటీసీ కుంర్ర జంగు పటేల్, కొలం సేవా సంఘం నాయకులు కొడప సోనే రావ్, తుడుం దెబ్బ నాయకులు కుర్సoగే తానాజీ, సహకార డైరెక్టర్ రామ్ చందర్, లిందుగుడా సర్పంచ్ సిడాం లక్ష్మణ్, చిట్యాల బోరి సర్పంచ్ కుంర్ర వసంతరావు, అంకొలి ఎంపీటీసీ మడావి కిషన్, హీరా సుక్క సంఘం నాయకులు సిడాం రామ్ కిషన్, అఖిల భారతీయ ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.