హైదరాబాద్, జూలై8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నీటిపారుదలశాఖ భారీగా కొలువుల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. నీటిపారుదల శాఖలోని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి 879 పోస్టులను మంజూరు చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధంచేయాలని అధికారులకు సూచిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇరిగేషన్ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గతంలో భారీ, మధ్య, చిన్న తరహా రంగాలుగా ఉన్న నీటిపారుదలశాఖను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి.. పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా ప్రాదేశిక ప్రాంతాలవారీగా ప్రాజెక్టుల బాధ్యతలను చీఫ్ ఇంజినీర్లకు అప్పగించారు. ప్రాజెక్టులు, పంప్లు, కాల్వలు, తూముల నిర్వహణ బాధ్యతల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక ఇంజినీర్ ఇన్ చీఫ్ పోస్ట్ను ఏర్పాటుచేశారు. తాజాగా ఆ విభాగానికి సంబంధించి 879 పోస్టులను మంజూరుచేశారు. వారిని రెగ్యులర్ విధానంలో నియమించాలని నిర్ణయించారు. అందుకు పేస్కేల్, గ్రేడ్లతో పాటు పలు మార్గదర్శకాలను సిద్ధంచేయాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.