హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు నమోదవడం క్రమంగా తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు తెలిపారు. అయినా కొవిడ్-19 పట్ల నిర్లక్ష్యం తగదని చెప్పారు. నిర్లక్ష్యం వహించకుండా కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అందరూ బాధ్యతగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. మూడో వేవ్ ఎప్పుడొస్తుందో చెప్పేందుకు సరైన అంచనాలు, ఆధారాలు లేవని వెల్లడించారు. మన నిర్లక్ష్యమే మూడో వేవ్ రాకకు కారణంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గురువారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి 20 లక్షల మందికి కరోనా టీకాలు వేశామని చెప్పారు. మొత్తం లక్ష్యం 2.20 కోట్ల మంది కాగా, దాదాపు సగం లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. ఎక్కువ మంది వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెప్పారు. మూడో వేవ్ విషయంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉన్నదన్నారు. ఒకవేళ అది వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశామని వివరించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని శ్రీనివాసరావు తెలిపారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు తగ్గుముఖం పట్టడానికి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలు కారణమని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షిత తాగునీరు అందిస్తుండటంతో ప్రజల ఆరోగ్య సమస్యలు తగ్గాయని, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు కూడా సురక్షితమైన నీటిని తాగటం వల్ల సీజనల్ వ్యాధుల వ్యాప్తి తగ్గిందని చెప్పారు. మలేరియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రెండేండ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.