సూర్యాపేట టౌన్, జూలై 4 : భారత్-చైనా సరిహద్దులో గత ఏడాది జరిగిన వివాదంలో వీరమరణం పొందిన మహావీరచక్ర కర్నల్ సంతోష్బాబు చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచిపోతాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన సంతోష్బాబు ప్రథమ వర్ధంతిలో మంత్రి పాల్గొన్నారు. సంతోష్బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతోష్బాబు వీరమరణం తెలంగాణతోపాటు యావత్ దేశాన్ని కంటతడి పెట్టించిందన్నారు. ఆయన ఇక్కడి వాడు కావడం సూర్యాపేటతోపాటు తెలంగాణకే గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిలో అతి చిన్న వయసులో వీర మరణం పొందిన సంతోష్బాబు ముందు వరుసలో ఉంటారన్నారు.
ఆయన జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అందించిన సహాయ సందేశం ఇతర రాష్ర్టాలతోపాటు యావత్ దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచిందని తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి కర్నల్ కుటుంబాన్ని పరామర్శించి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోపే సూర్యాపేట కోర్టు చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ ఏరియాకు సంతోష్బాబు చౌరస్తాగా నామకరణం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ సందర్భంగా వేద పండితుల సమక్షంలో సంతోష్బాబు కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం చేశారు. మంత్రిని వారు మెమొంటోతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నాయకులు ఉప్పల ఆనంద్, వెంపటి సురేశ్, దేవరశెట్టి సత్యనారాయణ, వంశీ పాల్గొన్నారు.