సిద్దిపేట: ప్రజల మేలు కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అలాంటి వ్యాధుల నుంచి ప్రజలను దూరం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇవాళ సిద్దిపేటలో పర్యటించారు.
వార్డు అభివృద్ధిలో భాగంగా రూ.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. స్వచ్ఛ సిద్దిపేట శుద్ధిపేటగా కావాలన్నదే తన తండ్లాట అని చెప్పారు. ప్రజా భాగస్వామ్యంతో చెత్త రహిత పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దేలా అందరి భాగస్వామ్యం కావాలన్నారు. తడి, పొడి, హానికరమైన చేత్త వేరు చేసి ఇస్తే యూజీడీ ఎంతో ఉపయోగకరంగా వాడొచ్చని సూచించారు.
చెత్త.. మానవ జీవన విధానానికే ప్రమాదం కలిగిస్తుందని వెల్లడించారు. పట్టణంలో నిత్యం 55 మెట్రిక్ టన్నులు చెత్త వస్తున్నదని, నెలలో 1650 టన్నుల చెత్త కుప్పలు గుట్టలుగా పేరుకుపోతున్నదని ప్రజలకు అవగాహన కల్పించారు. తడి ద్వారా కంపోస్టు ఎరువుల తయారీ, పొడి చెత్తను రీసైక్లింగ్, హానికరమైన చెత్తను అధిక ఉష్ణోగ్రతలో కాల్చివేస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలో నాలుగు దిక్కులా 5 ఫీట్ల మేర సెట్ బ్యాక్ నిబంధనలు పాటించి భవన నిర్మాణాలు జరిగేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ను మంత్రి హరీశ్ ఆదేశించారు.
రాష్ట్రంలోనే మొదటి స్వచ్ఛబడిని సిద్దిపేటలో పెట్టించామని, ఇక్కడ చెత్త గురించి పాఠాలు నేర్చుకోవచ్చన్నారు. రూ.4.30 కోట్లతో చెత్త నుంచి గ్యాస్ తయారు చేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించినున్నట్లు వెల్లడించారు. చెత్తతో సంపద-ఆదాయం పొందేలా సమాలోచనలు చేస్తున్నామన్నారు.