న్యూఢిల్లీ, జూలై 1: వైద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వైద్యుల కొరత, మౌలిక సదుపాయాలు, ఔషధాల లేమి, కాలంచెల్లిన టెక్నాలజీ వంటి వైద్య రంగ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎవరిదో వైఫల్యానికి విధి నిర్వహణలో ఉన్న వైద్యులపై దారుణమైన దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ‘మధుమేహాన్ని ఓడించండి’ పేరిట ఆర్ఎస్ఎస్డీఐ రూపకల్పన చేసిన ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వైద్య రంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సంస్థలు కృషి చేసిన రోజున వైద్యులకు నిజంగా ప్రజలు ‘వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు’ తెలియజేయవచ్చని వ్యాఖ్యానించారు.
దవాఖానలు నెలకొల్పి కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు లాభాలు ఆర్జిస్తుంటే వైద్యులను నిందించడం ఎందుకని ప్రశ్నించారు. వైద్యుల సేవలను కొనియాడుతూ వారిని నడిచే దేవుళ్లుగా, దేవతలుగా అభివర్ణించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమాచారం ప్రకారం కరోనా రెండో వేవ్లో 798 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారికి నివాళులర్పించారు. మధుమేహ వ్యాధి నివారణకు ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించాలని సూచించారు. అన్ని వయసుల వారు మధుమేహం బారినపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధికంగా భారత్లోనే 6.5 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్థులు ఉన్నారని, ఆ వ్యాధి మోగిస్తున్న ప్రమాదఘంటికలపై ప్రభుత్వం అప్రమత్తం కావలసి ఉందని చెప్పారు. పల్స్ పోలియో మాదిరిగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ప్రాణదాతలు… మన వైద్యులు: ప్రధాని
న్యూఢిల్లీ: కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటంలో వైద్యుల కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. కొత్తగా పుట్టుకొచ్చిన మహమ్మారి రకరకాలుగా తన రూపాన్ని మార్చుకున్నా వైద్యులు తమ అనుభవం, ప్రావీణ్యంతో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. గురువారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని వారిని ఉద్దేశించి మాట్లాడారు. కరోనా నుంచి లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత వైద్యులు, హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు దక్కుతుందన్నారు.