సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో హెల్త్ అండ్ సైన్సు అథారిటీ (HSA) సమక్షంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతం అయింది. టీసీఎస్ఎస్ వరుసగా గత పన్నెండు సంవత్సరాల నుండి ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తుంది. సొసైటీ పిలుపు మేరకు ఎంతో మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా హెల్త్ అండ్ సైన్స్ అథారిటీ ఆఫ్ సింగపూర్ అధికారులు మాట్లాడుతూ.. కొవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సామాజిక దూరం పాటిస్తూ ఈ శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఎల్లప్పుడూ ఎలాంటి లాభాపేక్షలేని సామాజిక కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీని కొనియాడడంతో పాటు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలు గా గోనె నరేందర్ రెడ్డి, శివ ప్రసాద్ ఆవుల మరియు ప్రవీణ్ మామిడాల వ్యవహరించారు. రక్తదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికి సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్, ఉపాధ్యక్షులు భాస్కర్ గుప్త నల్లా మరియు ఇతర సభ్యులు, శశిధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయని తెలిపారు.