బంజారాహిల్స్, జూన్ 27: ఢిల్లీలో వాయు కాలుష్యంతో ఎదురవుతున్న ఇబ్బందులు హైదరాబాద్ వాసులకు రావొద్దంటే అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో కాలుష్యాన్ని నియంత్రించాలంటే మొక్కలు నాటడమే ఏకైక మార్గమని చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఎంపీ సంతోష్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేలా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన హరితహారం స్ఫూర్తితో గ్రీన్ చాలెంజ్ను చేపట్టామని తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను సంతోష్కుమార్ అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బాబా ఫసియొద్దీన్, సీఎన్ రెడ్డి, రాజ్కుమార్ పటేల్, దేదీప్యరావు, సంగీతయాదవ్, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.