నల్లగొండ, జూన్ 27: కేంద్ర ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్లే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నదీజలాల సమస్య తీవ్రరూపం దాల్చుతున్నదని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. ఆదివా రం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజు నుంచే తెలంగాణ జలవనరుల దోపిడీకి బీజం పడిందన్నారు. 17 కిలోమీటర్ల దిగువన నందికొండ ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడే ఈ దోపిడీ మొదలైందని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మద్రాస్కు తాగునీటి పేరిట తొలుత తెలుగుగంగ ద్వారా 11 వేల క్యూసెక్కులను అక్రమంగా తీసుకెళ్లారని, వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా మరో 44 వేల క్యూసెక్కులు తీసుకెళ్లే కుట్ర చేశారని ఆరోపించారు. ఈ సమస్యను ఆనాడే గుర్తించిన కేసీఆర్ అనేక ఉద్యమాలు చేపట్టినా తెలంగాణ నేతలు ఎవ్వరూ మాట్లాడలేదన్నారు. నాడు వైఎస్ జలదోపిడీకి పాల్పడితే నేడు ఆయన కొడుకు జగన్ మరో రకమైన కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా (800 అడుగులు) శ్రీశైలం బెడ్ లెవల్ నుంచే నీటిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డా రు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశా రు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రితో మాట్లాడటం వల్ల ఎన్జీటీ అభ్యంతరం చెప్పిందన్నారు. పనులు నిలిపి వేయాలని కృష్ణాబోర్డు చెప్పినా ఏపీ ప్రభు త్వం బరితెగింపుతో కొనసాగిస్తున్నదన్నారు. రోశయ్య హయాంలో నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల గేట్లు తెరవగా ఆయనపై ఒత్తిడి చేసి మళ్లీ మూయించారని, దాంతో బ్యాక్ వాటర్ పెరిగి అప్పట్లో మహబూబ్నగర్, కర్నూలు జిల్లాలు మునిగిపోయి రూ.10 వేల కోట్ల నష్టం జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే దశాబ్దాల జల దోపిడీకి సీఎం కేసీఆర్ అడ్డుకట్ట వేస్తున్నారని తెలిపారు. సీఎం చొరవతో పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ టన్నెల్ 1, 2 పనులు జరుగుతున్నట్టు చెప్పారు. ఏ రూపురేఖలు లేనటువంటి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు వైఎస్ శంకుస్థాపన చేసి వదిలేస్తే.. సీఎం కేసీఆర్ రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును అనతికాలంలోనే నిర్మించి గోదావరి జలాలను అందిస్తున్న గొప్ప నాయకుడని అభివర్ణించారు. కృష్ణా జలాల అక్రమ తరలింపుపై తెలంగాణ ప్రభుత్వం కొట్లాడుతుంటే హుజూరాబాద్ ఉపఎన్నికల కోసమేనని బీజేపీ నేత లు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఇకనైనా నదీజలాల విషయంలో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కేంద్రం సమావేశం ఏర్పాటు చేసి వాస్తవ నీటి కేటాయింపులు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకే వచ్చే ప్రసక్తే లేదని గుత్తా సుఖేందర్రెడ్డి జోస్యం చెప్పారు. అప్పట్లో ఉత్తమ్ కుమార్ ఉండే… ఇప్పుడు ఉత్తర కుమారుడు వచ్చాడే తప్ప ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ రెండేండ్లలో ఆ పార్టీ సంసారం చక్క దిద్దుకుంటే చాలని టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్రెడ్డినుద్దేశించి వ్యాఖ్యానించారు.