యాదాద్రి, జూన్ 26 :యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. లాక్డౌన్ సడలింపు అనంతరం ఇంత పెద్దఎత్తున భక్తులు యాదాద్రీశుడిని దర్శించుకోవడం ఇదే ప్రథమం. ఒక్కరోజే సుమారు 10వేల మందిపై చిలుకు భక్తులు దర్శనానికి వచ్చినట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు జరిపారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ.100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు పెద్దఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారిని సహస్రనామార్చన చేశారు. సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీవారి ఖజానాకు రూ.12,76,279 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.12,76,279 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్తో రూ.2,04,312, రూ.100 దర్శనంతో రూ.29,300, వీఐపీ దర్శనాలతో రూ.91,050, నిత్యకైంకర్యాలతో రూ.400, సుప్రభాతంతో రూ.1,100, క్యారిబ్యాగులతో రూ.4,500, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ.65,000, కల్యాణకట్టతో రూ.23,160, ప్రసాద విక్రయంతో రూ.5,37,150, శాశ్వతపూజల ద్వారా రూ. 39,348, వాహనపూజలతో రూ. 10,500, టోల్గేట్తో రూ. 1,200, అన్నదాన విరాళంతో 8,762, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 90,540, యాదరుషి నిలయంతో రూ. 70,450, పాతగుట్టతో రూ. 31,595, టెంకాలయ విక్రయాలతో రూ. 48,000, ఇతర విభాగాలతో రూ. 28,912తో కలుపుకుని రూ.12,76,279 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.
నారసింహుడిని దర్శించుకున్న
శంషాబాద్ ఎయిర్ పోర్టు డీఐజీ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న శంషాబాద్ ఎయిర్పోర్టు డీఐజీ ఎంకే.సింగ్ కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి స్వామివారి ఆశీర్వచనం, తీర్థప్రసాదం అందజేశారు. ఆలయ ఏఈవో శ్రవణ్కుమార్, గజవెళ్లి రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.