చివ్వెంల, జూన్ 22 : గ్రామాల్లో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువు తయారు చేయడం వల్ల గ్రామ పంచాయతీలు ఆదాయం పొందవచ్చని స్వచ్ఛ భారత్ జిల్లా కో ఆర్డినేటర్ నరేందర్ అన్నారు. మండల కేంద్రం శివారులో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు వద్ద పంచాయతీ కార్యదర్శులకు, మల్టీ పర్పస్ వర్కర్లకు మంగళవారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. షెడ్డు వద్ద చెత్తను వర్మీకంపోస్టుగా మార్చి తయారైన సేంద్రియ ఎరువును రైతులకు విక్రయించి పంచాయతీకి నిధులు సమకూర్చుకోవాలని సూచించారు. అనంతరం వర్మీకంపోస్టు తయారు చేసే విధానాన్ని చూపిస్తూ వివరించారు. కార్యక్రమంలో ఎంపీఓ గోపి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జూలకంటి సుధాకర్రెడ్డి, ఏపీఓ నాగయ్య, పంచాయతీ కార్యదర్శులు రజినీ, కోటిరెడ్డి, చలమయ్య, కిరణ్, ఆదినారాయణ, జ్యోత్స్న, వసంత తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి : ఎంపీఓ
చింతలపాలెం : సేంద్రియ ఎరువుల తయారీపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీఓ జగదీశ్కుమార్ సూచించారు. సెగ్రిగేషన్ షెడ్లలోని వర్మీ కంపోస్టు కేంద్రాలను మంగళవారం మండల వ్యాప్తంగా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలందరికీ తడి, పొడి చెత్తను వేరు చేసే విధానంపై అవగాహన కల్పించి చైతన్యపర్చాలని కార్యదర్శులకు సూచించారు. ఎంపీటీసీ సైదిరెడ్డి, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.