సియోల్, జూన్ 21: మనిషి విసర్జించే ఘన వ్యర్థాల్లోని ఓ రకమైన బ్యాక్టీరియా కరోనా వైరస్ను నిరోధించడంలో సాయపడుతున్నట్టు దక్షిణ కొరియా పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. మధ్యస్థాయి, తీవ్రమైన కరోనా లక్షణాలు ఉన్న రోగుల్లో జీర్ణాశయాంతర లక్షణాలను గుర్తించినట్టు సియోల్లోని యోన్సేయీ యూనివర్సిటీకి చెందిన మొహమ్మద్ అలీ తెలిపారు. కరోనా సోకినప్పటికీ, రోగి పెద్దపేగుపై దాని ప్రభావం పెద్దగా లేదని, ఎందుకు ఇలా జరుగుతుందో లోతుగా విశ్లేషిస్తే.. మలంలోని బిఫిడో బ్యాక్టీరియానే దీనికి కారణమని తేలిందన్నారు. పేగు గోడలపై వైరస్ దాడి చేయకుండా ఈ బ్యాక్టీరియానే రక్షణ కవచంలా నిలుస్తున్నట్టు వెల్లడించారు. కరోనా చికిత్సల్లో ఈ బ్యాక్టీరియా పాత్రపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నట్టు వివరించారు.