సిటీబ్యూరో,జూన్ 14 (నమస్తే తెలంగాణ) : ఆమె లక్ష్యం ఆడపిల్లల్లో చైతన్యం తీసుకరావడం..చదువు మధ్యలో మానేయకుండా ఉన్నత విద్య చదవడం.. మనం మాత్రమే కాదు..మనతోటి ఆడవారు కూడా ఉన్నతంగా ఉండాలన్న ఆశయం పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నది. చిన్నచిన్న విషయాలకే కుంగిపోవద్దని, ధైర్యంగా అభ్యసించాలని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు విద్యానగర్లోని ఆంధ్ర మహిళా సభ (ఏఎంఎస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ శాంతి వేదుల. ఆమె లక్ష్యం ఉపాధ్యాయురాలు. బ్యాంకు ఉద్యోగం అవకాశం వచ్చినా వదులుకున్నారు. డిగ్రీ ఎంకామ్లో గోల్డ్మెడల్ సాధించిన ఆమె అధ్యాపకురాలిగా చేరి విద్యతోపాటు ఆడపిల్లలకు ఉపయోగపడేలా సామాజిక సేవ చేయాలన్న ఉద్దేశంతో పలు కళాశాలల్లో అధ్యాపకురాలిగా కొనసాగారు. 27 ఏండ్లుగా అధ్యాపక వృత్తిలో సాగుతూనే వేలాదిమంది విద్యార్థినులు డిగ్రీ స్థాయిలో చదువు మానేయకుండా కృషి చేస్తున్నారు. ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆడపిల్లల పరిస్థితి గుర్తించి తానే ఫీజు చెల్లించి చదువు కొనసాగేలా ప్రోత్సహిస్తున్నారు. చదువుకున్న చదువు..తెలుసుకున్న విజ్ఞానం నలుగురి బాగు కోసం ఉపయోగపడాలని అంటారామె. ఆడపిల్లల ప్రగతిని కాంక్షిస్తూ ఓవైపు అధ్యాపకురాలిగా, సామాజిక కార్యకర్త, వ్యాసకర్త, ఉపన్యాసకురాలిగా కొనసాగుతున్నారు.
కొందరికైనా స్ఫూర్తినివ్వాలని : శాంతి వేదుల
ఆడపిల్లల చదువు..అవనికి వెలుగు అన్నది నా ముఖ్య ఉద్దేశం. నేటితరం యువతులను ఉన్నత చదువుల దిశగా తీసుకెళ్లడం, సమాజంలో గౌరవంగా బతికే విధానాలను బోధించడం ప్రధాన లక్ష్యం. నేను చేస్తున్న ప్రయత్నం కొందరు యువతులకైనా స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. పదోతరగతి నుంచి ఎంకామ్ వరకు అన్ని కోర్సుల్లోనూ ఫస్టే. నా చదువు ద్వారా కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా ఆడపిల్లల్లో చైతన్యం తీసుకవాలన్న ఉద్దేశంతో కామర్స్ సబ్జెక్టు బోధనతో అధ్యాపక వృత్తి చేపట్టాను. 27 ఏళ్లుగా ఈ వృత్తిలో ఎక్కువకాలం అందులో మహిళా కళాశాలల్లోనే పనిచేస్తూ వచ్చాను. పాఠ్యాంశాలకు సామాజిక సేవా దృక్పథం జతచేసి..సమాజానికి, మహిళా సాధికారతకు విద్య ఎంత అవసరం అన్నది గుర్తించేలా డిగ్రీ విద్యార్థినులకు బోధిస్తున్నాను. డిగ్రీలో చేరే ఆడపిల్లలు ఎక్కువగా 18 ఏండ్లు పైబడిన వారే కాబట్టి వారు చదువు కొనసాగించేలా కృషి చేస్తున్నాను. యూట్యూబ్ చానల్ ద్వారా సంబంధిత సబ్జెక్టులో పాఠ్యాంశాలను చదువుకునేందుకు వీడియో పాఠాలను కూడా అప్లోడ్ చేస్తున్నాను. పేద విద్యార్థినులకు కెరీర్ గైడెన్స్ పుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నాను. పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు బ్యాగులు, పాఠ్య పుస్తకాలను కూడా ఉచితంగా అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నానని వివరించారు.