హైదరాబాద్ : తెలంగాణలో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే నైరుతి రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. దీనికి తోడు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో మరింత బలపడుతుందని పేర్కొంది. అలాగే పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని చెప్పింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్ స్థాయి వరకు వ్యాపించింది ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల అతి భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.
మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలో భారీ వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇదిలా ఉండగా.. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి.