న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రెండో వేవ్ ఉద్ధృతం కావడంతో ప్రజల్లో ఇమ్యూనైజేషన్ కోసం కోడిగుడ్ల వినియోగం పెరిగింది. బర్డ్ఫ్లూ ప్రచారంతో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో గుడ్ల వినియోగం తగ్గింది. మళ్లీ కోవిడ్-19 విజృంభించడంతో, రోగ నిరోధకత పెంచుకోవడానికి ప్రజలు కోడిగుడ్ల వాడకం పెంచేశారు.
వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్, కర్ఫ్యూ ఆంక్షల మధ్య కార్మికుల కొరతతో సరఫరా ఇబ్బందులు ఉన్నా గిరాకీ పుంజుకున్నది. దాణా ఖర్చు పెరిగిపోవడంతో గుడ్ల రిటైల్ ధరలు రూ.6-7 వరకు పెరిగాయి.
కరోనా రోగులకు అధికంగా ప్రోటీన్లు లభించే ఆహారం అవసరమని వైద్యులు సలహా ఇస్తున్నారు. చౌక ధరలోనే ప్రోటీన్లు అందాలంటే గుడ్లు సులభ మార్గమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కోడిగుడ్లలో అత్యధికంగా 11 శాతం ప్రోటీన్ కంటెంట్ ఉంటుందని కేంద్ర పశు సంవర్థక, పౌల్ట్రీ, పాడి పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి ఓపీ చౌధరి చెప్పారు.నెలవారీగా గుడ్ల వినియోగం పెరుగుదలను అంచనా వేయలేమని మరో అధికారి అన్నారు.
గతేడాది ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్డౌన్ వల్ల కోళ్ల పరిశ్రమ భారీగా దెబ్బతిందని ఇండియన్ బ్రాయిలర్ గ్రూప్ తెలిపింది. అప్పుడు గుడ్లు, చికెన్కు గిరాకీ కూడా తగ్గింది. తిరిగి జూన్-డిసెంబరులో మళ్లీ గిరాకీ పుంజుకుందన్నది.
గత ఏడాది జూన్లో ఒక వ్యక్తి నెలవారీగా సగటున ఏడు గుడ్లు తింటే ఈ ఏడాది తొలి రెండు నెలల్లో బర్డ్ఫ్లూ భయంతో సరాసరి నాలుగు గుడ్లే వినియోగించారు. మార్చి తర్వాత గిరాకీ మళ్లీ పుంజుకుంది.
కొవిడ్ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో వినియోగం పెరిగి, మళ్లీ నెలకు ఏడు గుడ్లకు చేరింది.ఈ ధరలో కోడిగుడ్డు తప్ప మరే ఆహారంలో ఇంత ప్రోటీన్ దొరకదు.అందుకే గుడ్లకు గిరాకీ బాగా పెరుగుతున్నది.
పట్టణాల్లో గుడ్లకు గిరాకీ ఎక్కువగా ఉన్నందునే దాని ధరలు అధికం అవుతాయని జాతీయ కోడిగుడ్ల సమన్వయ కమిటీ (నెక్) జోనల్ ఛైర్మన్ ప్రవీణ్ గార్గ్ చెప్పారు.
లాక్డౌన్లు, కర్ఫ్యూ తదితర ఆంక్షలతో కోళ్ల ఫారాల యజమానులకు సరిపడా సిబ్బంది అందుబాటులో లేరు. దాణా వ్యయం పెరగడంతో గుడ్ల సరఫరా కష్టంగా మారింది.
దేశంలో 2018-19లో 10,300 కోట్ల మేర, 2019-20లో 14వేల కోట్లకు కోడిగుడ్లు పెరిగాయి. వీటిలో 98 శాతం గుడ్లు దేశంలోనే వాడుతున్నారు. రోజూ 2 గుడ్లు తింటే శరీరానికి అవసరమైన డీ, బీ-12 తదితర విటమిన్లు లభిస్తాయి
సాధారణంగా హర్యానాలో ఒక్కో గుడ్డుకు రైతుకు రూ.3-3.50 లభిస్తుంది. అది గత రెండు నెలల్లోగరిష్ఠంగా రూ.5.50కు చేరింది. ఇప్పుడు రూ.4.80 లభిస్తుంది.
విపణిలో ప్యాకింగ్ లేని గుడ్లు రిటైల్ మార్కెట్లో రూ.6-7కు విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ గుడ్లను రూ.10 అంతకంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి.