జహీరాబాద్, ఏప్రిల్ 4 : ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంజీరా నీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథలో భాగంగా జహీరాబాద్ మున్సిపల్ పాత వార్డులో రూ. 23.11 కోట్లతో పనులు వేగవంతంగా చేస్తున్నది. సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా తాగునీటిని పట్టణ సమీపంలో నిర్మాణం చేసిన సంపు నుంచి నేరుగా ట్యాంకులకు సరఫరా చేసేందుకు పనులు చేస్తున్నారు. ఐడీఎస్ఎంటీ కాలనీలో కొత్తగా 14 లక్షల లీటర్ల్ల ట్యాంకుని నిర్మిస్తున్నారు. దీంతో పాటు పశువుల సంతలో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకుని నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసేందుకు 39 కిలో మీటర్ల పైపులైన్ నిర్మాణం చేస్తున్నారు. ప్రధాన సంపు నుంచి ట్యాంకులకు నీటిని సరఫరా చేసేందుకు 5 కిలో మీటర్ల పైపులైన్ ఏర్పాటు చేశారు. కొత్తగా 6800 నల్లా కనెక్షన్లు ఇస్తున్నారు. మిషన్ భగీరథలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకులు, పైపులైన్, నల్లాకనెక్షన్తో పాటు ఫైబర్ లైన్పైపు వేస్తున్నారు. ఫైబర్ లైన్ పైపుతో ప్రతి ఇంటికి ఆన్లైన్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసి పనులు చేస్తున్నది.
నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు పైపులైన్ ఏర్పాటు
జహీరాబాద్ పట్టణంలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు మిషన్ భగీరథలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు రెండింటిని నిర్మిస్తున్నారు. మిషన్ భగీరథ నీటిలో మినరల్స్ ఉంటాయని, నీటిని ఫిల్టర్ చేసి బ్లీచింగ్ ఫౌడర్, క్లోరినేషన్ వంటి ప్రక్రియ ద్వారా ఫిల్టర్ చేసి సరఫరా చేస్తారు. మిషన్ భగీరథతో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం రూ.23.11 కోట్లు జహీరాబాద్ మున్సిపల్కు మంజూరు చేసింది. ఐడీఎస్ఎంటీ కాలనీ, పశువుల సంతలో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేస్తున్నారు. గతంలో అధికారులు మిషన్ భగీరథలో 19 కిలోమీటర్లు వేసేందుకు సర్వే చేసి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం కాలనీలు పెరిగిపోవడం, ఇండ్ల్ల సంఖ్య గతంలో కంటే అధికం కావడం జరిగింది. దీంతో మిషన్ భగీరథ అధికారులు కొత్తగా సర్వే చేసి 39 కిలో మీటర్ల పైపులైన్ నిర్మాణం చేస్తున్నారు. గతంలో 5400 నల్లా కనెక్షన్లు ఇవ్వగా, ప్రస్తుతం 6800 నల్లా కనెక్షన్లు ఇస్తున్నారు. ప్రతి ఇంటి ముందు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఉండే విధానంగా పనులు చేస్తున్నారు. వేసవి వచ్చిందంటే బోర్లు, బావులు ఎండిపోయేవి. చిన్నా పెద్దా అంతా నెత్తిన బిందెలు పెట్టుకొని నీరు ఉన్న చోటికి బారులు తీరేవారు. దీంతో తాగునీటి సమస్యను పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు ముం దుకు వచ్చింది. కాలనీలో పైపులైన్ వేసి వాల్ ఏర్పాటు చేశారు. పైపులైన్ పనులు పూర్తి కావడంతో ట్రయల్ రన్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నీటి ఎద్దడి నివారణ కోసమే..
జహీరాబాద్ పట్టణానికి తాగునీటి కష్టాలు ప్రతి ఏడాది వేసవిలో ఉండేవి. తాగునీటి సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగరీథలో రూ. 23.11 కోట్లు మంజూరు చేసింది. మున్సిపల్ విలీన గ్రామాలైన రంజోల్, అల్లీపూర్, పస్తాపూర్, చిన్న హైదరాబాద్, హోతి(కే) గ్రామాల్లో మిషన్ భగరీథ పనులు పూర్తి చేసి మంజీరా నీరు సరఫరా చేస్తున్నారు. తాగునీటి కష్టాలు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం పనులు జోరుగా సాగిస్తున్నది. సమస్య రాకుండా ఉండేందుకు ప్రతి ఇంటికి ఒక నల్లా కనెక్షన్ మిషన్ భగరీథ అధికారులు ఇస్తున్నారు. జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్, దత్తగిరి కాలనీ, శ్రీనగర్కాలనీ, బసవ నగర్. సుభాశ్గంజ్తో పాటు పలు కాలనీలో మిషన్ భగరీథ పనులు చేస్తున్నారు.