లింగాలఘనపురం, జూన్ 9: ఓ రైతు కుటుంబం సమస్యపై అర్ధరాత్రి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ వెంటనే చర్యలకు కలెక్టర్ను ఆదేశించారు. దీంతో కలెక్టర్ సైతం అర్ధరాత్రే బాధితులతో మాట్లాడి.. తెల్లారేసరికే గ్రామంలో విచారణ చేపట్టారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం సిరిపురంలో బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సిరిపురానికి చెందిన మహిళా రైతు పప్పుల సువర్ణకు గ్రామంలోని సర్వేనంబర్ 114 డీలో 4.37 ఎకరాల భూమి ఉన్నది. అధికారులు ఆమె పేర పట్టాదారు పాసుపుస్తకం జారీచేశారు. అందులో నుంచి 0.15 గుంటల భూమి దేవాదుల కాలువ కింద పోగా.. ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లించింది. మిగిలిన భూమికి రైతుబంధు సాయం కూడా అందుతున్నది. సువర్ణ గత నెల 4న మృతిచెందగా.. బాధిత కుటుంబసభ్యులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల సువర్ణకు రైతుబీమా వర్తించదని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు మంగళవారం ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కు సమస్యను నివేదించారు. మంత్రి కేటీఆర్ అర్ధరాత్రి ఆ మెసేజ్ చూసి స్పందించారు. చర్యల కోసం జిల్లా కలెక్టరు నిఖిలకు ఆదేశాలు జారీచేశారు. అదేరాత్రి 2 గంటలకు కలెక్టర్.. సువర్ణ భర్త ఉప్పలయ్య, కుమారుడు కౌశిక్కు ఫోన్చేసి వివరాలు సేకరించారు. బుధవారం తెల్లారేసరికి మండల రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేటీఆర్ ట్వీట్తో అధికారులు స్పందించడంపై కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.