ముంబై,జూన్ 7: కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా మంది స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. 2020 మార్చి నుంచి మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఓ సమయంలో 26వేల దిగువకు చేరుకున్నాయి. సూచీలు పతనమైన సమయంలో ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోలుకు ఆసక్తి చూపారు. అదే సమయంలో కొత్తగా కోట్లాది మంది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడికి మొగ్గు చూపారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి 14 నెలల కాలంలో 1.8 కోట్ల కొత్త డిమ్యాట్ అకౌంట్లు ప్రారంభమయ్యాయి. నెలకు 13 లక్షల కొత్త ఖాతాలు ఓపెన్ చేశారు.
బీఎస్ఈ డేటా ప్రకారం ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి మొత్తం రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్య 6.97 కోట్లుగా నమోదయింది. 2020 మార్చి 23వ తేదీన మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన అనంతరం మార్చి నెలలో సూచీలు దాదాపు 35 శాతం పతనమయ్యాయి. ఆ తర్వాత 2020 డిసెంబర్ నాటికి కాస్త పెరిగి 15 శాతం ఎగిశాయి. ఇక FY20-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి 68 శాతం ఎగిసింది. 2008-09 ఆర్థిక సంక్షోభం అనంతరం సూచీలు 68 శాతం ఎగిశాయి. ఇప్పుడు 68 శాతం పెరిగింది.