వాషింగ్టన్: భారత్లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెలిస్ మేయర్ ఎరిక్ గార్సెటీని అధ్యక్షుడు జో బైడెన్ నియమించే అవకాశాలున్నాయని మీడియా వార్తలు వెలువడ్డాయి. భారత్లో అమెరికా రాయబారి పదవి గత జనవరి 20 నుంచి ఖాళీగా ఉన్నది. వాషింగ్టన్ లో అధికార మార్పిడి జరగడమే అందుకు కారణం. 50 సంవత్సరాల గార్సెటీ అమెరికాలో న్యూయార్క్ తరువాత రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజెలిస్కు 42వ మేయరుగా ఉన్నారు. అధ్యక్షుడు బైడెన్ ప్రచార కమిటీకి గార్సెటీ కోచైర్మన్గా ఉన్నారు. నిజానికి ఆయనకు బైడెన్ ప్రభుత్వంలో కీలక పదవి లభిస్తుందని అనుకున్నారు. కానీ ఎందువల్లనో కుదరలేదు. అందుకే ఆయనను కీలకమైన భారత రాయబారి పదవిలో నియమించాలని బైడెన్ నిర్ణయించారు. అలాగే చైనాకు నికోలస్ బర్న్స్, జపాన్కు రహమ్ ఇమాన్యుయేల్, టామ్ నైడ్స్ ఇజ్రాయెల్కు రాయబారిగా వెల్లనున్నారని తెలిసింది. కాగా గార్సెటీ కావచ్చు, మరొకరు కావచ్చు.. నియామక ప్రకటన వెలువడేంత వరకు ఏదీ ఖరారు కానట్టేనని వైట్హౌస్ ప్రతినిధి తెలిపారు.