అమరావతి : సీలేరు నదిలో రెండు నాటుపడవలు మునిగిపోయాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. నీటిలో ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన మల్కాన్గిరి జిల్లా కెందుడుగ వద్ద సోమవారం అర్ధరాతి చోటు చేసుకున్నది. విశాఖపట్నం నుంచి ఒడిశా వెళ్లేందుకు నాటుపడవలో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు నాటుపడవల్లో 11 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అందరు వలస కూలీలుగా సమాచారం. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కూలీలు స్వగ్రామాలకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
గల్లంతైన కూలీలు గుంటవాడ, కెందుగుడకు చెందిన వారిగా గుర్తించారు. ముందుగా వెళ్తున్న నాటుపడవ.. అదుపు తప్పి నీట మునిగిందని.. ఆ తర్వాత వెనుకాలే వస్తున్న మరో నాటుపడవ దాన్ని ఢీకొట్టడంతో మునిగిపోయిందని ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి ఒకరు తెలిపారు. గిరిజన కూలీలు హైదరాబాద్ నుంచి ఒడిశాలోని స్వగ్రామానికి వెళ్లేందుకు సోమవారం సాయంత్రం వరకు సీలేరుకు చేరుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎవరైనా వెళ్లకుండా అడ్డుకుంటారనే ఉద్దేశంతో రాత్రి సమయంలో రెండునాటుపడవల్లో బయలుదేరారు. ఈ క్రమంలోనే రెండు పడవలు నీటమునిగాయి. సమాచారం అందుకున్న అధికారులు గల్లంతైన వారికి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.