అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అందరి మన్నలు పొందుతున్న రియల్ హీరో సోనూసూద్. గత ఏడాది కన్నా ఈ ఏడాది దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్న సోనూసూద్ సరైన వసతుల్లేక ఎంతోమంది కరోనాతో కన్నుమూయడం నన్ను చలింపజేసిందని అన్నారు. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క, ప్రాణవాయువు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులు నన్ను ఆవేదనకు గురి చేశాయి అని సోనూసూద్ పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి వలన ప్రతి రోజు ఎంతో మంది తమ కుటుంబ సభ్యులని, ఆప్తులని కోల్పోయి కన్నీరు పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితులు చూశాక నా తల్లిదండ్రులు సరైన సయయంలో కన్నుమూశారని భావిస్తున్నాను. ఒకవేళ వారు ఇప్పుడు ఉండి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడితే అది చూసి నా హృదయం ముక్కలయ్యేది అని సోనూసూద్ పేర్కొన్నారు. నాకు చేతనంత సాయం చేశాను, దాని వలన సంతోషంగా ఉంది. రాజకీయ నాయకులు కూడా ఒకరిపై ఒకరు బురద జల్లుకోకుండా సాయం అందించాలి అని సోనూ పేర్కొన్నారు.