కొవిడ్ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ మహమ్మారి విలయంతో లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులవుతున్నాయి. గతేడాది కన్నా పరిస్థితులు తీవ్రంగా కనిపిస్తున్నాయి. అయితే ఇవిప్పుడు ఆపత్కాలంలో అవసరమయ్యే ఆర్థిక ప్రణాళిక ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నాయి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోరాదని కరోనా గుణపాఠం నేర్పింది మరి. మన క్షేమంపై రాజీ పడకుండా కొత్తగా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరాన్నీ గుర్తుచేసింది. అందుకే కష్ట కాలంలో ఆర్థిక భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలు.. ఎటువంటి ప్రణాళిక అవసరమో ఈ వారం తెలుసుకుందాం.
మదుపుల్లో సమతుల్యత
పరిస్థితులనుబట్టి మన ఆలోచనా తీరులోనూ మార్పులు రావాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలం. అందుకే మన పెట్టుబడుల్లో సమతుల్యత చాలా ముఖ్యం. కొన్ని రంగాలకో లేదా కొన్ని అసెట్లకో అధిక ప్రాధన్యత ఇచ్చి వాటిలో సమతుల్యత తీసుకురావడానికి ప్రయత్నించండి. తక్కువ రిస్క్ మోస్తరు రాబడులను ఇచ్చే సాధనాలకు ప్రాధన్యత ఇవ్వండి. పోర్టుఫోలియోలో సమతుల్యత సాధించడం ద్వారా ఆశించిన రాబడులను సాధించవచ్చు. చాలావరకు మదుపు సాధనాలు ఇప్పటికే మార్కెట్ ఒడిదుడుకులను చవిచూశాయి. ఓ ఏడాది తర్వాత పరిస్థితులు స్థిర పడవచ్చు. ఓపిగ్గా చాలాకాలం నుంచి మదుపు చేస్తున్నవారు దీర్ఘకాల రాబడులను
పొందుతున్నారు.
అత్యవసర పొదుపు
గడిచిన ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయి, వ్యాపారాలు సాగక, పనులు దొరకక ఆదాయాలు పడిపోయిన వారెందరో. అందుకే అత్యవసర నిధి గురించి అంతా ఆలోచించాలి. ఇలాంటి సమయాల్లో అది మీ అత్యవసరాలను, అప్పులను తీర్చేందుకు ఉపయోగపడుతుంది. అయితే కనీసం 6 నుంచి 9 నెలల కాలం ఎలాంటి ఆదాయం లేకపోయినా బతికేయవచ్చు అన్న ధైర్యం ఇచ్చేంతలా మన పొదుపు ఉండాలి. ఇందుకోసం అనవసర ఖర్చులను, విలాసాలను పక్కన పెట్టాల్సిందే. కరోనా కాలంలో మనం నేర్చుకోవాల్సింది ఖర్చు చేయాల్సిన పద్ధతుల గురించే మరి.
తగిన బీమా
కరోనా నేపథ్యంలో బీమాకున్న ప్రాధాన్యత తెలుస్తున్నది. ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికపరంగానూ వైరస్ ధాటికి ఎన్నో కుటుంబాలు కుదేలవుతున్నాయి. ఇలాంటి దుస్థితి నుంచి మనకు, మన కుటుంబ సభ్యులకు భద్రత కావాలంటే కావాల్సిందల్లా జీవిత బీమా, ఆరోగ్య బీమానే. ముఖ్యంగా దవాఖానల బిల్లులు లక్షల్లోనే ఉంటున్నాయి. అందుకే ఆరోగ్య బీమా అవసరం ఇప్పుడు. రూ.5 లక్షల నుంచి 10 లక్షల కవరేజీ పాలసీలు తీసుకోవడం ఉత్తమం. ఇక జీవిత బీమా కవరేజీ మీ కుటుంబానికి అండగా ఉంటుంది. తక్కువ వయసులో తీసుకుంటే ప్రీమియం కూడా తక్కువే.
అప్పుల తీర్చివేత
తీసుకున్న అప్పులకు గతేడాది కాలంగా ఈఎంఐలు చెల్లించలేనివారు అనేకం. కొన్ని రుణాల విషయాల్లో వడ్డీ అదనంగా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే రుణాలను తక్కువగా తీసుకోవడమే కాదు.. వాటిని తిరిగి చెల్లించే విషయంలోనూ క్రమశిక్షణ తప్పనిసరి. ముఖ్యంగా ఆదాయ వనరులు ఆవిరైనప్పుడు శక్తికి మించిన రుణాలను తీసుకోకూడదు. అంతేగాక తీసుకున్న అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చుకోవాలి. అలాగే విచ్చలవిడిగా క్రెడిట్ కార్డును వినియోగించడాన్ని మానుకోవాలి. క్రెడిట్ స్కోర్ కనీసం 750-850 ఉండేలా చూసుకోవాలి.
ఆర్థిక లక్ష్యాల్లో మార్పులు
లాక్డౌన్ కారణంగా చాలామంది ఆదాయాలు తగ్గిపోయాయి. ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదల లేదు. పెరిగిన ఖర్చుల కారణంగా ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి నిర్దేశించుకున్న పొదుపు, మదుపులపై ప్రభావం పడింది. కాబట్టి మీరు చేస్తున్న పొదుపులను సమీక్షించండి. మీ ఆదాయంలో ఇప్పటికే నిర్దేశించుకున్న మొత్తాలను పొదుపు చేయలేకపోతే, అందుకు తగ్గట్టుగా వాటిలో మార్పులు, చేర్పులు చేయండి.
అదిల్ శెట్టి సీఈవో, బ్యాంక్బజార్.కామ్
చివరగా: దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఇంకా రికవరీ బాట పట్టలేదు. అందుకే ఆర్థిక సంక్షోభాలకు తగ్గట్టుగా మన ఆర్థిక ప్రణాళిక ఉండాలి. పొదుపు, బీమా, మదుపు ఆర్థిక ప్రణాళికలో భాగంగా ఉండాలి. కాబట్టి కొత్తగా ఉత్పన్నమైన పరిస్థితులకు తగ్గట్టుగా చక్కని ఆర్థిక ప్రణాళికను రూపొందించండి.