విస్తరిస్తున్న విజయ డెయిరీ

- ప్రజలకు మరింత చేరువలో..
- మరిన్ని పార్లర్ల ఏర్పాటుకు అనుమతి
- పెరిగిన విజయ పాల పదార్థాల అమ్మకాలు
హన్మకొండ చౌరస్తా : విజయ డెయిరీ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. మరిన్ని పార్లర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హన్మకొండ అలంకార్ సమీపంలోని విజయ పాల డెయిరీ ప్రైవేటు డెయిరీలకు దీటుగా ముందుకెళ్తున్నది. నాణ్యత, స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తున్నది. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు డెయిరీలకు ఎక్కడా స్థానం కల్పించకుండా నమ్మకం, నాణ్యతతో కూడి న ఉత్పత్తులు అందిస్తున్నది. ప్రైవేటు డెయిరీలు సేకరిస్తున్న లీటర్ పాలకు అదనంగా విజయ డెయిరీ రూ.4 ప్రోత్సాహాన్ని అందిస్తూ పాడి రైతులను ప్రైవేటు డెయిరీల బారిన పడకుండా కాపాడుకుంటున్నది.
ప్రజలకు విజయ డెయిరీ మరింత చేరువైయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. గల్లీకో విజయ పార్లర్ ఏర్పాటు చేస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ మినహా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచి సుమారు 3 వేలకుపైగా పాడి రైతులు ప్రతిరోజూ 7500 లీటర్ల పాలు పోస్తున్నారు. సుమారు 218 వరకు పాల సేకరణ కేంద్రాలు ఉం డగా, అందులో పాలశీతలీకరణ కేంద్రాలు-7 ఉన్నాయి. 92 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఉన్నాయి. రైతుల నుంచి సేకరించిన పాలను హన్మకొండ డెయిరీకి తీసుకువచ్చి శుద్ధి చేసి ప్యాకెట్లు ద్వారా విక్రయిస్తారు. పాలు పోసేవారికి వెన్న శాతాన్నిబట్టి ధర చెల్లిస్తున్నారు.
ఉత్పత్తులకు ఆదరణ..
2007లో విజయ పాల డెయిరీ ఆధ్వర్యంలో పాల పదార్థాల విక్రయ కేంద్రాలు ప్రారంభించారు. రైతుల నుంచి సేకరిస్తున్న పాలను ప్యాకెట్లు, నెయ్యి, బాదం పాలతో పా టు వివిధ రకాల ఉత్పత్తులు పార్లర్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రైవేటు డెయిరీలతో పోల్చితే విజ య డెయిరీ ధరలు తక్కువనే చెప్పుకోవాలి. నాణ్యత, ధర తక్కువ ఉండడంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు మక్కు వ చూపిస్తున్నారు. విజయ ఉత్పత్తులకు మార్కెట్లో మం చి డిమాండ్ కూడా ఉంది. పెరుగు, స్వీట్లు, లస్సీ, మజ్జిగ, నెయ్యి, వెన్న, మిల్క్కేక్, దూద్పేడా, కోవా, సుగంధపాల వంటి ఉత్పత్తుల అమ్మకం ద్వారా నెలకు కోట్ల రూపాయల్లో ఆదాయం సమకూరుతున్నది. నెయ్యి ఉత్పత్తుల సరఫరాలో విజయ డెయిరీ ముందంజలో ఉంది. విజయ కొబ్బరినూనె, సన్ఫ్లవర్, పల్లి నూనె, ఐస్క్రీములు, బాదం పాలు, బట్టర్ మిల్క్, ఆవు, గేదె నెయ్యితో పాటు వివిధ రకాల విజయ పాల ఉత్పత్తులకు ఆదరణ లభిస్తున్నది.
దరఖాస్తుల వెల్లువ..
విజయ డెయిరీని విస్తృతం చేసేందుకు మరిన్ని పార్లర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. దీంతో గల్లీకొక్కటి ఏర్పాటు కానున్నాయి. పార్లర్ల ఏర్పాటుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే 36 దరఖాస్తులు రాగా, అందులో 18 వరకు ఇప్పటికే ప్రారంభించారు. కొన్ని పార్లర్లు ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. విజ య పార్లర్ల ఏర్పాటుతో ఇప్పటికే 50 శాతం విక్రయాలు కూడా పెరిగాయి. పాల పదార్థాలు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే నిర్వాహకులకు ఇక నుంచి ర వాణా చార్జీలు, సమయం వృథా కాకుండా ఈ నెల 6న నుంచి విజయ డెయిరీ నేరుగా అందిస్తూ ప్రోత్సహిస్తున్నది.
ఆదరణ పెరుగుతోంది..
విజయ పాల డెయిరీ విక్రయాలు రోజురోజుకు పెంచేందు కు పార్లర్లకు అనుమతులిస్తు న్నాం. విజయ ఉత్పత్తుల కు ప్ర జల నుంచి మంచి ఆదరణ వ స్తుంది. ఇప్పటివరకు 36 మంది దరఖాస్తు చేసుకోగా 18 వరకు ప్రారంభించారు. ఇంకా ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రైవేటుకు ధీటుగా నమ్మకం, నాణ్యతతో కూడి న పాల ఉత్పత్తులు అందిస్తున్నాం. పార్లర్లు పెరగడంతో ఇప్పటికే 50 శాతం పాల విక్రయాలు కూడా పెరిగాయి.
-ప్రదీప్, విజయ పాల డెయిరీ ఉపసంచాలకుడు