జనగామలో అకాల వర్షం
మార్కెట్లో తడిసి ముద్దయిన ధాన్యం
జనగామ, మే 20 (నమస్తే తెలంగాణ) : చెడగొట్టు వాన మరోసారి రైతన్నను కష్టాలపాలు చేసింది. జనగామ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భారీగా కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. అమ్మకాని తెచ్చిన ధాన్యాన్ని ముంచెత్తింది. పోసిన రాశులు, తూకం చేసి నింపిన బస్తాలు నీటిలో నానిపోయాయి. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో వందలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. చాలా మంది రైతులు పొలంలో తూర్పారబట్టిన ధాన్యం అమ్మకానికి నేరుగా మార్కెట్కు తరలిస్తున్నారు. మార్కెట్ యార్డు ప్లాట్ ఫారం, పాత యార్డు కల్లంలో పలువురు రైతులు ధాన్యాన్ని ఆరబోశారు. దీంతో పాటు తరలింపునకు సిద్ధంగా ఉన్న ధాన్యం కూడా తడిసిపోయింది. కాగా, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ బాల్దె విజయ సిద్ధిలింగం భరోసా ఇచ్చారు. జిల్లా వాప్తంగా 75.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా దేవరుప్పుల మండలంలో 22.4మిల్లీ మీటర్లు, స్టేషన్ఘన్పూర్లో 17.4, బచ్చన్నపేటలో 14.2, లింగాలఘనపురంలో 10.6, జనగామలో 7, రఘునాథపల్లిలో 3.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రామాల్లోని కొనగోలు కేంద్రాల్లో రైతులు ముందు జాగ్రత్తగా కవర్లు కప్పుకోవడంతో నష్టం తప్పింది.